హైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య 

హైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య 

జగిత్యాల : జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యాపారి హైదరాబాద్ లో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రతాప్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

అసలేం జరిగింది..? 

బాధితుల కథనం ప్రకారం.. మెట్ పల్లి పట్టణంలోని చైతన్యనగర్ కు చెందిన సబ్బాని నరేష్ అనే వ్యాపారి.. కథలాపూర్ మండలంలో కొంతకాలంగా హీరో షోరూం నడుపుతున్నాడు. తన వద్ద ఐదారేళ్లుగా ప్రతాప్ అనే వ్యక్తి నమ్మకంగా పని చేస్తున్నాడు. ప్రతాప్ తనకు వచ్చిన ఆలోచనతో భవానీ ఎంటర్ ప్రైజెస్ పేరుతో వాహనాల లక్కీ డ్రా ప్రారంభిద్దామని నరేష్ కు సూచించాడు. దీనికి నరేష్ కూడా ఒప్పుకోవడంతో అనుకున్నట్లుగానే ఇద్దరూ కలిసి బైక్ స్కీమ్ ను ప్రారంభించారు. 

కొన్నాళ్ల పాటు ఇద్దరూ బాగానే బిజినెస్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే నరేష్ హైదరాబాద్ కు వచ్చి.. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్కీమ్ పేరుతో ప్రతాప్.. కోటి 90 లక్షల రూపాయలను బాధితుల వద్ద తీసుకొని తనను, స్కీమ్ లో డబ్బులు కట్టిన బాధితులను మోసం చేశాడని నరేష్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. కొన్ని రోజులుగా డబ్బుల విషయంలో నరేష్ ను ప్రతాప్ వేధిస్తూ వచ్చాడని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. 

సబ్బాని నరేష్ సెల్ఫీ వీడియో ప్రకారం..

‘‘ నేను షోరూమ్ లో బైక్స్ స్కీమ్ చేశాను. ప్రతాప్ అనే వ్యక్తిని కలుపుకొని ఆరు స్కీమ్ లు చేశాము. రెండు స్కీమ్ లు క్లియర్ అయిపోయాయి. తర్వాత ప్రతాప్ కు పూర్తి ఇన్ చార్జ్ బాధ్యతలు ఇచ్చాను. ఆ తర్వాత అతడి పేరుపై బ్యాంకు ఖాతా కూడా తెరిచాను. నా పేరుపై ఉంటే అతడి పేరుపై తీయించుకున్నాడు. నేను కూడా దీనికి అంగీకరించి..కోరుట్ల హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ప్రతాప్ పేరుపై కరెంట్ ఖాతా ఓపెన్ చేయించా.

మిగతా నాలుగు స్కీమ్ లకు సంబంధించి..నేను ఇప్పటి వరకూ 350 వెహికిల్స్ ను స్కీమ్ ద్వారా ఇచ్చాను. 350 వెహికిల్స్ కు సంబంధించి.. ఆఫ్ లైన్ ద్వారా, ఆన్ లైన్ ద్వారా ప్రతాప్ కొంత డబ్బు నాకు ఇచ్చాడు. మిగతా డబ్బులు ప్రతి నెల వస్తాయని అనుకుని.. నేను కూడా ఏమీ అనలేదు. డబ్బుల గురించి కూడా ప్రతాప్ ను చాలాసార్లు అడిగాను. డబ్బులు ఎక్కడా పోవు అని సమాధానం ఇచ్చేవాడు. డబ్బులు వసూలు చేసి, ఇస్తానని చెప్పాడు. ఐదు, ఆరేళ్లుగా నా వద్ద నమ్మకంగా పని చేస్తున్నందున అతడిని పూర్తిగా నమ్మాను. నేను నమ్మినందుకు తగిన గుణపాఠం చెప్పాడు. నాకు జీవితం అనేది లేకుండా చేశాడు. ఈ లోటును ముందే గుర్తించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. 

స్కీమ్ లు పూర్తయ్యే సమయం వచ్చింది. అందరికీ సెటిల్ మెంట్ చేసే సమయం అది. మళ్లీ డబ్బుల గురించి ప్రతాప్ ను అడిగాను.  డబ్బులు వస్తాయి.. చివరిదాక మనకు టెన్షన్ ఉండదు అని చెప్పాడు. నేను కూడా అదే నమ్మకంతో ఉన్నాను. తర్వాత స్కీమ్ దగ్గరకు వచ్చింది. రెండు నెలల సమయం ఉంది. మరోసారి కూడా ప్రతాప్ ను డబ్బుల గురించి అడిగాను. అప్పుడు కొన్ని రోజులు సమయం తీసుకుని.. ఒక స్కీమ్ 62 లక్షలు ఇచ్చేది ఉందని చెప్పాడు. ’’ అంటూ సబ్బాని నరేష్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.