- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ సంతృప్తి తెలంగాణలో
- ఖేలో ఇండియా పోటీల నిర్వహణ అవకాశాలపై చర్చ
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో అందుబాటులో ఉన్న క్రీడా సౌకర్యాలపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) డైరెక్టర్ జనరల్, భారత ప్రభుత్వ క్రీడల కార్యదర్శి హరి రంజన్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన స్టేడియంలోని స్పోర్ట్స్ టవర్, ఫిఫా అకాడమీ, హాకీ అకాడమీ, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, మెయిన్ స్టేడియం తదితర సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి, రీజినల్ డైరెక్టర్ విష్ణు సుధాకరన్, ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణలో అమలవుతున్న ఖేలో ఇండియా కార్యక్రమాలు సహా ఇతర క్రీడా అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఖేలో ఇండియా పోటీలను తెలంగాణలో నిర్వహించే అవకాశాలు, అవసరమైన సౌకర్యాలపై సమీక్షించారు .గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న ఫిఫా అకాడమీ ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులను హరి రంజన్ రావు అభినందించారు.
