ఎంజీఎంలో శానిటేషన్ ​కార్మికులు పురుగుల మందు తాగిన్రు..

ఎంజీఎంలో శానిటేషన్ ​కార్మికులు పురుగుల మందు తాగిన్రు..

వరంగల్ సిటీ, వెలుగు :  వరంగల్ ఎంజీఎం దవాఖానలోని సూపరింటెండెంట్ ఆఫీసు ఎదుట శుక్రవారం సాయంత్రం ముగ్గురు శానిటేషన్ కార్మికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుల కథనం ప్రకారం..వరంగల్ ఎంజీఎం దవాఖానలో జీవో నంబర్​34 ద్వారా 35 మంది శానిటేషన్ కార్మికులను తీసుకున్నారు.

2019 నుంచి వీరు డ్యూటీలు చేస్తున్నారు. ఇందులో 19 మందిని తెలంగాణ అభ్యుదయ సొసైటీ తరపున మరో 16 మందిని కృష్ణ కన్స్ట్రక్షన్స్ ద్వారా భర్తీ చేశారు. కృష్ణ కన్​స్ర్టక్ష్సన్ ​ద్వారా రూ.11వేల జీతం చెల్లిస్తుండగా, తెలంగాణ అభ్యుదయ సొసైటీ ద్వారా రూ.12వేలు ఇస్తున్నారు. దీంతో 16 మంది కార్మికులు తమకు అభ్యుదయ ఏజెన్సీ ద్వారానే జీతాలు చెల్లించాలని కొంత కాలంగా డిమాండ్​ చేస్తున్నారు. చాలాసార్లు అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసిగిపోయిన పద్మ, గడ్డం రమేశ్, వనజ అనే కార్మికులు శుక్రవారం సూపరింటెండెంట్​ చాంబార్​లో పురుగుల మందు తాగారు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన ఎమర్జెన్సీకి తరలించారు.  

కలెక్టర్​కు ఫైలు పంపాను : సూపరింటెండెంట్​ 

16 మందిని తెలంగాణ అభ్యుదయ ఏజెన్సీ కింద తీసుకునేందుకు కలెక్టర్​కు, డైరెక్టర్​ ఆఫ్​ మెడికల్​ఎడ్యుకేషన్​కు ఫైలు పంపినట్లు సూపరింటెండెంట్ చంద్రశేఖర్​ తెలిపారు. అధికారుల నుంచి ఆమోదం వచ్చిన వెంటనే వారిని తెలంగాణ ఏజెన్సీ కింద పనిచేసేందుకు అనుమతిస్తామని, జీతాలు కూడా చెల్లిస్తామని చెప్పారు.