హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి తర్వాతే రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్ వస్తారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ఈ నెల 13 నుంచి మూఢాలు ఉన్నాయని, సంక్రాంతి తర్వాతే మంచి రోజులు ఉండటంతో అప్పుడే కొత్త చీఫ్ వస్తారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్తో బీజేపీకి యుద్ధం జరుగుతోందని, ఆ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని పేర్కొన్నారు. బుధవారం మురళీధర్రావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవికి పోటీ పడుతున్నారా అని ప్రశ్నించగా.. గతంలో ఇస్తానంటే వద్దన్నానని, ఇప్పుడు కావాలనుకుంటే అమిత్షాకే చెప్తానని సమాధానమిచ్చారు. పార్టీ నేత రాంమాధవ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.
అది కేసీఆర్ ఓటమే..
రాష్ట్రంలో టీఆర్ఎస్ తో బీజేపీకి యుద్ధం జరుగుతోందని, ఆ పార్టీ తమకు ప్రత్యర్థేనని మురళీధర్రావు చెప్పారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ గెలిచారని అనుకోవడం లేదని.. కార్మికుల్లో, ప్రజల్లో సీఎంపై వ్యతిరేకత పెరిగిందని తెలిపారు. భవిష్యత్తులో దీని ప్రభావం కనిపిస్తుందన్నారు. టీఆర్ఎస్ కు చెందిన నేతలు కొందరు బీజేపీతో టచ్లో ఉన్నారన్న అంశాన్ని ప్రస్తావించగా.. టచ్లో ఉంటే తప్పేమిటన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరలోనే పుంజుకుంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పని ఎప్పుడో అయిపోయిందని కామెంట్ చేశారు. కేవలం మద్యం వల్లే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్న దానిని తాను అంగీకరించనన్నారు. ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ పై తనకు ఎలాంటి అనుమానాలూ లేవని, విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. కాగా.. కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో ఆ రాష్ట్ర పార్టీకి ఇన్చార్జిగా ఉన్న మురళీధర్రావును నేతలు సన్మానించారు.