
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ రెపో రేటుతో లింక్ అయ్యే గృహ రుణాల విధానాన్ని జూలై నుంచి ప్రవేశపెడుతోంది. ఇటీవలే షార్ట్ టర్మ్ లోన్లను, లార్జ్ సేవింగ్స్ డిపాజిట్స్ రేట్లను రెపో రేటుతో లింక్ చేసిన సంగతి తెలిసిందే. రూ.లక్షకు పైన ఉన్న క్యాష్ క్రెడిట్ అకౌంట్(సీబీ), ఓవర్ డ్రాఫ్ట్(ఓడీ)లకు కూడా వడ్డీరేట్లను ఎస్బీఐ తగ్గించింది. జూలై 1 నుంచి రెపోతో లింక్ అయ్యే హోమ్ లోన్స్ విధానాన్ని తీసుకొస్తామని ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్) లింక్తో కూడా గృహ రుణాలను ఆఫర్ చేయడం కొనసాగిస్తామని కానీ కస్టమర్లు కావాలంటే రెపోతో లింక్ అయ్యే గృహ రుణ రేటును ఎంపిక చేసుకోవచ్చని ఎస్బీఐ రిటైల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా తెలిపారు.
8.40 శాతానికి కొత్త గృహ రుణాలు లభ్యం….
ప్రస్తుతం రూ.75 లక్షల వరకున్న గృహ రుణాలను 8.55 శాతానికి ఎస్బీఐ ఆఫర్ చేస్తోంది. కొత్త రుణాన్ని 5.75 శాతం రెపో రేటుకు 2.25 శాతం అదనంగా ఆఫర్ చేస్తోంది. అంటే 8 శాతమవుతుంది. ఆ 8 శాతానికి 40 బేసిస్ పాయింట్లను కూడా ఛార్జ్ చేస్తుందని గుప్తా చెప్పారు. అంటే మొత్తంగా కొత్త గృహ రుణాలు 8.40 శాతానికి లభ్యం కానున్నాయి. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు 0.25 శాతం ఛార్జ్తో రెపో రేటు లింక్డ్ ప్రొడక్ట్లకు మారవచ్చని కూడా గుప్తా తెలిపారు. తాము ఆర్బీఐ రెపో రేట్లను వేగవంతంగా కస్టమర్లకు చేరవేయడానికి తమ రుణ రేట్లను క్రమక్రమంగా రెపోతో లింక్ చేయడం ప్రారంభించామని ఎస్బీఐ సీఎఫ్ఓ ప్రశాంత్ కుమార్ చెప్పారు. ఆర్బీఐ గురువారం రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ రేట్ల కోత ప్రకటించిన వెంటనే ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2019 వరుసగా మూడోసారి ఆర్బీఐ రేట్ల కోతను ప్రకటించింది. ఈ 25 బేసిస్ పాయింట్ల రేటు కోత ప్రయోజనాలను తమ సీసీ/ఓడీ కస్టమర్లకు(రూ.లక్షకు పైనున్న) కూడా జూలై 1 నుంచి అందిస్తామని ఎస్బీఐ తెలిపింది. దీంతో రెపోతో లింక్ అయ్యే సీసీ/ఓడీ కస్టమర్ల లెండింగ్ రేటు 8 శాతంగా ఉండనుంది. రూ.లక్షకు పైన ఉన్న సేవింగ్స్ డిపాజిట్ల వడ్డీ రేటు 3 శాతంగా ఉంటుందని ఎస్బీఐ తెలిపింది.