కామారెడ్డి కలెక్టరేట్​ఎదుట..వ్యక్తి సూసైడ్​ అటెంప్ట్

కామారెడ్డి కలెక్టరేట్​ఎదుట..వ్యక్తి సూసైడ్​ అటెంప్ట్

కామారెడ్డి , వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్​ఎదుట సోమవారం  మద్నూర్ ​మండలం అవల్​గావ్​కు చెందిన పి.సిద్ధప్ప అనే వ్యక్తి పెట్రోల్​పోసుకొని  ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడున్న పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మద్నూర్​ మార్కెట్​కమిటీలో రూ.5 కోట్ల వరకు  కుంభకోణం జరిగిందని, గతంలో తాను ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎంక్వైరీ చేయడం లేదని, ఈ విషయం తెలుసుకొని స్థానిక ఆఫీసర్లు, బీఆర్​ఎస్​ లీడర్లు తనను  వేధిస్తున్నారని పేర్కొన్నాడు.

ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, ఎంక్వైరీ కూడా చేయలేదన్నాడు. తన వద్ద ఉన్న ఆధారాలతో గతంలోనే ప్రజావాణిలో ఫిర్యాదు చేశానని, చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆఫీసర్లకు తెలిపానని, అప్లికేషన్​కూడా రాశానన్నారు. పొద్దున కలెక్టరేట్లోని ప్రజావాణి వద్దకు వచ్చి వెళ్లిన సిద్ధప్ప.. మధ్యాహ్నం తర్వాత కలెక్టరేట్​ మెయిన్​ గేట్​ బయట  సీసాలో తెచ్చుకున్న పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్సై ఉదయ్​ శేఖర్, ఇతర సిబ్బంది అతన్ని కాపాడారు. పెట్రోల్​ డబ్బా, అగ్గిపెట్టె లాక్కున్నారు.  అనంతరం దేవునిపల్లి పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లి వివరాలు సేకరించి పంపారు.