- మారిన రంజీ ట్రోఫీ ఫార్మాట్
- 10 నుంచి ఫస్ట్ ఫేజ్..
- మే 30–జూన్ 6 మధ్య నాకౌట్ రౌండ్
న్యూఢిల్లీ: రెండేళ్ల గ్యాప్ తర్వాత రెండు దశల్లో జరిగే ఈ సీజన్ రంజీ ట్రోఫీలో మ్యాచ్ల సంఖ్య భారీగా తగ్గింది. 38 టీమ్స్ పోటీపడ్డ లాస్ట్ సీజన్లో 169 మ్యాచ్లు జరగ్గా.. ఈ సారి కేవలం 64 మ్యాచ్లు మాత్రమే ఉంటాయి. టోర్నీ ఫార్మాట్ను మార్చడమే ఇందుకు కారణం. కొత్త ఫార్మాట్ ప్రకారం లీగ్ దశలో ఒక జట్టు కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. ఈ మేరకు టోర్నీ షెడ్యూల్, ఫార్మాట్ను బీసీసీఐ సెక్రటరీ జై షా గురువారం స్టేట్ అసోసియేషన్స్కు ఈ మెయిల్ చేశారు. దీని ప్రకారం టోర్నీ ఫస్ట్ ఫేజ్ ఈ నెల 10 నుంచి మార్చి 15వ తేదీ వరకు, ఐపీఎల్ ముగిసిన తర్వాత మే 30–జూన్6 మధ్య సెకండ్ ఫేజ్ జరుగుతుంది. ఈ సీజన్లో మొత్తం 38 టీమ్స్, 9 వేదికల్లో పోటీ పడతాయి. టీమ్స్ను తొమ్మిది గ్రూప్లుగా డివైడ్ చేశారు. ఎనిమిది ఎలైట్ గ్రూప్స్లో నాలుగేసి జట్లు, ఒక ప్లేట్ గ్రూప్లో ఆరు టీమ్స్ను చేర్చారు.
లీగ్ స్టేజ్లో ఎలైట్ గ్రూప్లోని ఒక్కో టీమ్ మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్లో పోటీ పడుతుంది. అదే ప్లేట్ టీమ్స్.. తమ గ్రూప్లోని ఏవైనా మూడు టీమ్స్తో తలపడుతాయి. లీగ్ దశ తర్వాత ఎలైట్ గ్రూప్స్లో టాప్ ప్లేస్లో నిలిచిన 8 టీమ్స్లో ఏడు నేరుగా క్వార్టర్ఫైనల్కు క్వాలిఫై అవుతాయి. వీటిలో తక్కువ ర్యాంక్లో ఉన్న టీమ్.. ప్లేట్ గ్రూప్ టాపర్తో ప్రిక్వార్టర్ ఫైనల్ ఆడుతుంది. ఇందులో గెలిచిన టీమ్ క్వార్టర్స్కు వెళ్తుంది. ఎలైట్ గ్రూప్ లీగ్ మ్యాచ్లు రాజ్కోట్, కటక్, చెన్నై, అహ్మదాబాద్, త్రివేండ్రం, ఢిల్లీ, హర్యానా, గౌహతిలో జరుగుతాయి. ప్లేట్ గ్రూప్ లీగ్ మ్యాచ్లకు కోల్కతా ఆతిథ్యం ఇస్తుంది.

