ఇందిరమ్మ టవర్స్ ఇండ్ల కేటాయింపు పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సిటీ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
లబ్ధిదారుల నుంచి రూ.10వేల ముందస్తు డిపాజిట్ చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇండ్ల కేటాయింపు పేరుతో నకిలీ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు, అపరిచిత లింకుల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు.
‘డబ్బులు చెల్లిస్తే ఇల్లు కచ్చితంగా ఇప్పిస్తాం...ఈ రోజే చివరి తేదీ.. వెంటనే డబ్బులు చెల్లించకపోతే ఇల్లు రద్దవుతుంది’ అంటూ ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మవద్దని సూచించారు. గైడ్ చేస్తాం అంటూ ఎనీడెస్క్, టీమ్వ్యూయర్ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్లను డౌన్లోడ్ చేయించే వారి మాటలు నమ్మవద్దన్నారు.
స్కీంకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం 040-24603572 హెల్ప్లైన్ను సంప్రదించాలన్నారు. మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని సూచించారు.
