రెండో విడతలో 86% పోలింగ్..రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓటింగ్

రెండో విడతలో 86%  పోలింగ్..రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓటింగ్
  • యాదాద్రి భువనగిరి, ఖమ్మంలో 91 శాతం దాటిన పోలింగ్​ 
  • అత్యల్పంగా నిజామాబాద్​లో​ 76%, జగిత్యాలలో 78% నమోదు 
  • ఓటింగ్​లో  పెద్ద ఎత్తున్న పాల్గొన్న మహిళలు

హైదరాబాద్, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. చదువు, ఉపాధిరీత్యా దూరప్రాంతాలకు వెళ్లి, రాలేకపోయినవారు మినహాయించి గ్రామాల్లో ఉన్నవారంతా దాదాపు ఓటేశారు. 

18 ఏండ్ల యువత నుంచి 90 ఏండ్లు దాటిన పండు ముసలి వరకు అందరూ ఉత్సాహంగా ఓటింగ్​లో పాల్గొన్నారు. అన్నిచోట్లా మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్​ముగిసింది. ఒంటి గంటలోపు క్యూలైన్​లో ఉన్నవారిని ఓటేసేందుకు ఎన్నికల ఆఫీసర్లు అనుమతిచ్చారు. పోలింగ్​ముగిసిన తర్వాత గంట లంచ్​బ్రేక్​ తీసుకొని ఆ వెంటనే కౌంటింగ్​ప్రారంభించి విజేతలను ప్రకటించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. 

ఈ విడతలో 3,911 పంచాయతీలకు, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 54,40,339 మంది ఓటర్లకు గానూ.. 46,70,972 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 85.86 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం, ఖమ్మం జిల్లాలో 91.21 శాతం పోలింగ్ నమోదు కాగా.. నిజామాబాద్​ జిల్లాలో అత్యల్పంగా 76.71 శాతం, జగిత్యాలలో 78.34 శాతం ఓటింగ్​నమోదైంది. 

 415 పంచాయతీలు ఏకగ్రీవం 

రెండో విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 5  పంచాయతీలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక మరో 415 పంచాయతీల్లో సర్పంచ్, 8,307 వార్డు  స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల రెండు పంచాయతీలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్,  29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.  

సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది, వార్డు మెంబర్ల కోసం 71,071 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  కాగా, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి పట్నం ప్రజలు పల్లె బాట పట్టారు. పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. 

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం రూట్​లో చౌటుప్పల్ దగ్గర హైవేపై భారీగా వాహనాలు కనిపించాయి. వరంగల్, జనగామ, భువనగిరి వెళ్లేవారితో గూడురు టోల్​గేట్​వద్ద సందడి వాతావరణ కనిపించింది. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాల్లోనూ రద్దీ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్​నమోదు కాగా.. రెండో విడతలో 85.86% ఓటింగ్ నమోదైంది. అంటే ఈ సారి 1.58 శాతం ఎక్కువ  పోలింగ్​అయ్యింది. 

46.70 లక్షల మంది ఓటుహక్కు వినియోగం..  

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ఈ సారి 54,40,339 ఓటర్లు ఉండగా.. 46,70,972 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 27,82,494 ఓటర్లు ఉండగా.. 23,93,010 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 86% ఓటింగ్​ నమోదైంది. 26,57,702 పురుష ఓటర్లుకు గాను.. 22,77,902 మంది ఓటేశారు. 

అంటే.. పురుష ఓటర్లు 85.71% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతరుల ఓట్లు 143 ఉండగా.. 60 (41%) మంది ఓటేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,02,716 మంది ఓటర్లుకు గాను.. 1,85,937 మంది ఓటేయగా.. 91.72 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. 

అలాగే, ఖమ్మం జిల్లాల్లోనూ 91.21శాతం, సూర్యాపేట జిల్లాలో 89.55, మెదక్​  88.74, నల్గొండ 88.74 నమోదు కాగా..  అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 76.71 శాతం, జగిత్యాల 78.34, భద్రాద్రి కొత్తగూడెం 82.65, నిర్మల్ 82.67, వికారాబాద్ 82.72 శాతం ఓటింగ్​ నమోదైంది.  

మహిళా ఓటర్ల హవా

ఈ విడతలో మహిళా ఓటర్లు 27,82,494 ఉండగా.. 23,93,010 మంది ఓటు హక్కు  వినియోగించుకున్నారు. పలు జిల్లాల్లో మహిళలు పెద్దఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.62 శాతం, ఖమ్మం 90.88, మెదక్​ 89.28 అత్యధికంగా ఓటింగ్​ నమోదు కాగా.. భద్రాద్రి కొత్తగూడెం 81.38 శాతం, వికారాబాద్ 81.79, ములుగు 82.79 శాతం అత్యల్పంగా మహిళా ఓటింగ్ నమోదైంది. 

పురుషుల ఓటింగ్ శాతంలో కూడా యాదాద్రి జిల్లా 91.83 శాతం, ఖమ్మం  91.56 శాతం జిల్లాలే ముందంజలో ఉన్నాయి. అయితే, నిజామాబాద్ (68.95 శాతం), జగిత్యాల (71.25 శాతం) జిల్లాల్లో పురుషుల ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. 

ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ వంటి జిల్లాల్లో గల్ఫ్ వలసల ప్రభావం ఓటింగ్ శాతంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ పురుషుల ఓటింగ్ శాతం 70 నుంచి -78 శాతం మధ్యలో ఉండగా, మహిళల ఓటింగ్ శాతం మాత్రం 83- నుంచి 86 శాతం వరకు ఉంది. 

మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలైన కౌంటింగ్..

ఎన్నికల ఆఫీసర్లు భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ను ప్రారంభించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. గతంతో పోలిస్తే ఈసారి పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు భారీగా తగ్గినట్టు అధికారులు పేర్కొన్నారు.  ఓట్ల లెక్కింపు సమయంలో గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 

వార్డుల వారీగా రౌండ్ టు రౌండ్ ఓట్ల ఫలితాలను వెల్లడించారు. గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. కొన్ని చోట్ల చెదురుముదురు  ఘటనలు మినహా మిగిలిన అన్నీ చోట్ల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్త్​ నిర్వహించారు. 

మరోవైపు.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ రాణి కుముదిని, పంచాయతీ ఎన్నికల అథారిటీ సృజన, ఎస్ఈసీ సెక్రటరీ మంద మకరందు  ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించారు. 

 ఈ సారి 3,769  పోలింగ్​ కేంద్రాల్లో వెబ్​కాస్టింగ్​ నిర్వహించగా.. పోలింగ్ సరళిని అబ్జర్వ్ చేసి జిల్లా ఎలక్షన్​ ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. మొత్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు విజయవంతం కావడంతో ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇదే స్ఫూర్తితో మూడో విడత విజయవంతం చేయాలి..

మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది ఇదే స్ఫూర్తితో మూడో విడత ఎన్నికలు విజయవంతం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికలను వెబ్​ క్యాస్టింగ్​ ద్వారా పర్యవేక్షించాం. ఈ సారి 3,769  పోలింగ్​ కేంద్రాల్లో వెబ్​క్యాస్టింగ్​ నిర్వహించాం. పోలింగ్ సరళిని అబ్జర్వ్ చేసి జిల్లా ఎలక్షన్​ ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేశామని   పీఆర్, ఆర్డీ డైరెక్టర్​ సృజన తెలిపారు.

రెండో విడత పోరు ఇలా.. 

  • మండలాలు 193 
  • సర్పంచ్​ స్థానాలు 3,911 
  • వార్డులు 29,917 
  • ఏకగ్రీవమైన పంచాయతీలు 415 
  • పోలింగ్​ కేంద్రాలు38,350 
  • పోలింగ్​ కేంద్రాల్లో వెబ్​కాస్టింగ్ 3,769 
  • మొత్తం ఓటర్లు54,40,339 
  • ఓటు వేసినవారు46,70,972 
  • మొత్తం పోలింగ్ నమోదు85.86% 
  • అత్యధికంగాయాదాద్రి భువనగిరి91.72% 
  • అత్యల్పంగా నిజామాబాద్ 76.71%