సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ కన్నుమూత

సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ కన్నుమూత

ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ (82) కన్ను మూశారు. చెన్నయ్ లోని టి నగర్ నివాసంలో ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు.  ఈ రోజు సాయంత్రం చెన్నయ్ లో ఆయన పార్దీవ దేహానికి అంత్యక్రియలు జరుగబోతున్నాయి. ఆయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు విజయ్ శ్రీనివాస్ ఉన్నారు. విజయ్ శ్రీనివాస్‌ దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు.

శ్రీను మాస్టర్ జన్మస్థలం అధోని. తల్లిదండ్రులు లక్ష్మీ దేవమ్మ, నారాయణప్ప. 1956లో తన బావగారైన హీరాలాల్ మాస్టర్ దగ్గర శిష్యుడిగా పనిచేశారు. తొలుత ఢిల్లీ రవీంద్రభారతిలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన గురుసుందర్ ప్రసాద్ వద్ద శ్రీను మాస్టర్ కథక్  నృత్యం అభ్యసించారు. ఆ తర్వాత విశ్వంగురు వద్ద కథాకళి సాధన చేశారు. సినిమా నృత్యాలను బావ హీరాలాల్ వద్ద ప్రాక్టీస్ చేశారు.

1969లో నిర్మాత డూండి రూపొందించిన ‘నేనంటే నేనే’ చిత్రంతో డాన్సు మాస్టర్‌గా శ్రీను సినిమాల్లోకి వచ్చారు. తరువాత ‘మహాబలుడు, భక్తకన్నప్ప, దొరబాబు, ఎదురులేని మనిషి, యుగపురుషుడు, యుగంధర్’ వంటి చిత్రాలకు నృత్య రీతులు సమకూర్చడంతో శ్రీను మాస్టర్ పేరు పరిశ్రమలో మార్మోగింది. ఏడెనిమిది భారతీయ భాషా చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. 1700 లకు చిత్రాలకు పైగా కొరియోగ్రఫీ పచేసిన ఆయనకు ‘స్వర్ణకమలం, రాధాగోపాలం, శ్రీరామరాజ్యం’ చిత్రాలకు గానూ బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డులు వచ్చాయి.

Senior choreographer Srinu master is no more