బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి?

బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి?

GHMC ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చెందింది. ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. విజయశాంతి వంటి కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారు. లేటెస్టుగా కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి జానారెడ్డి బీజేపీలో చేరతారనే ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.

టీఆర్ఎస్ నేత, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవలే మృతి చెందారు. గత ఎన్నికల్లో నోముల చేతిలో జానారెడ్డి ఓడిపోయారు. నోముల మృతితో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉపఎన్నికలో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపబోతోందనే చర్చ అప్పుడే ప్రారంభమైంది.

TRS కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతున్నక్రమంలో ఆ పార్టీలో చేరేందుకు జానా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో బీజేపీ నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి జానారెడ్డి కూడా ఒప్పుకున్నారని… ఇక్కడ కూడా గెలుపొంది సత్తా చాటాలనే యోచనలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నట్టు సమాచారం.