డిజిటల్ ఎంట్రీతో మళ్లీ ఫాంలోకి సీనియర్ హీరోయిన్లు

డిజిటల్ ఎంట్రీతో మళ్లీ ఫాంలోకి సీనియర్ హీరోయిన్లు

డిజిటల్ ప్లాట్ ఫామ్ వచ్చిన తర్వాత చాలా మందికి పని దొరికింది. ఎంటర్ టైన్మెంట్ పరంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకుంటే కొత్త, పాత నటీనటులు, టెక్నీషియన్లు మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీ రంగం దూసుకుపోతోంది. దీంతో చాలా మంది యాక్టర్లు  తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఓటీటీలను సరైన వేదికగా వాడుకుంటున్నారు. ఫేడవుట్ అయిపోయిన హీరోహీరోయిన్లు కూడా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇది కేవలం ఏ ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీకో పరిమితం కాలేదు. బాలీవుడ్ తో పాటు, టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లో దర్శనమిస్తూ.. తమ సత్తా చాటుతున్నారు. 

ఒకప్పుడు టాప్ హీరోయిన్ లుగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లంతా ఇప్పుడు ఓటీటీ బాటపడుతున్నారు. అందులో ముఖ్యంగా మాధూరి దీక్షిత్, సోనాలి బింద్రే, కాజోల్, సుస్మితా సేన్, రాణీ ముఖర్జీ, రవీనా టాండన్, రమ్యకృష్ణ, తదితరులు వెబ్ సిరీస్ లు చేస్తూ తమ కెరీర్లో దూసుకుపోతున్నారు.

మాధురి దీక్షిత్ :

ఒకప్పుడు బాలీవుడ్ లో నెంబర్ వన్ కథానాయికగా దుమ్ము దులిపిన మాధురి దీక్షిత్.. ఇప్పటికీ అదే గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమె అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదని సమాచారం. దానికి కారణాలు ఏమైనా గానీ.. ప్రస్తుతం ఆమెకు ఓ వెబ్ సిరీస్ స్టోరీ బాగా నచ్చడంతో వెంటనే చేసేసిందని ప్రచారం. కరణ్ జొహార్ నిర్మించిన ‘‘ఫేమ్ గేమ్‘‘ అనే వెబ్ సీరీస్ లో మాధురి మెయిన్ లీడ్ రోల్ లో కనిపించింది. అయితే జనవరిలో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయిన ఈ సిరీస్ అందరినీ అలరించింది.

సొనాలీ బింద్రే:

సోనాలీ బింద్రె కూడా... డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. లేటెస్ట్ గా ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేసారు. మీడియాలో.. జర్నలిస్ట్ లు సేకరించిన వార్తలు.. నిజాలు.. బయటకు రాకుండా ఎలా ఉంటాయో... రాజకీయాలు ఎలా జరుగుతాయో.. అక్కడ ఎలాంటి ఒత్తిడి ఉంటుంది లాంటివి ఈ టీజర్లో కనిపిస్తుంది. వినాయ్ వైకుల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో సోనాలి బింద్రే ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఇది జూన్ 10 న ప్రీమియర్ కాబోతుంది.

కాజోల్ 

హీరో అజయ్ దేవగణ్ వైఫ్, బాలీవుడ్ నటి కాజోల్ ఎంత పెద్ద స్టారో తెలిసిందే. చాలా రోజుల తర్వాత ముఖానికి మేకప్ వేసుకున్న కాజోల్.. 2021 లో ‘‘త్రిభంగ్’’ అనే సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయిన ఈ వెబ్ సిరీస్ తనకు మంచి పేరు తెచ్చింది. కాజోల్, తన్వీ అజ్మీ, మిథిలా పాల్కర్ నటించిన ఈ సిరీస్ అందర్నీ అలరించి...  అప్పట్లో ట్రెండింగ్ లో నిలిచింది.

రవీనా టాండన్:

రవీనా టాండన్ హిందీతో పాటు సౌత్ లో కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది.ఈ మధ్య యాక్టింగ్ తగ్గించేసింది. కానీ లేటెస్ట్ గా సెన్సేషనల్ ఫిలిం ‘‘కేజీఎఫ్ 2’’ లో పవర్ ఫుల్ రోల్ లో కనిపించింది. అప్పుడే మరో క్రైమ్ థ్రిల్లర్ చేసింది. ‘‘అరణ్యక్’’ పేరు తో లాస్ట్ ఈయర్ వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఆధ్యంతం ఉత్కంఠకు గురి చేస్తుంది. రవీనా చేసిన మొదటి వెబ్ సిరీస్ ఇదే. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో అవేలబుల్ గా ఉంది.. ఇంకా చూడకపోతే ఓ లుక్కేయండి.

సుస్మితా సేన్

ఒకప్పుడు వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ గా నిలిచిన సుష్మితా సేన్.. ఇప్పుడు డిజిటల్ స్టార్ అయిపోయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆర్య, ఆర్య 2 లాంటి సిరీస్‌లు ఈమెకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ తీసుకొచ్చాయి. ఆ వెబ్ సిరీస్ లు రెండూ సూపర్ హిట్ కావడంతో ఆమె మళ్లీ క్రేజ్ ను సంపాదించుకుంటోంది. 

రాణి ముఖర్జీ:

రాణి ముఖర్జీ సినిమాలు చేయడం క్రమంగా తగ్గించేసింది. పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. కానీ 2013లోనే ఓ ఆంథాలజీలో యాక్ట్ చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ఈ ఆంథాలజీని కరణ్ జోహర్ డైరెక్ట్ చేశాడు. ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు పొంది, ప్రత్యేక ఇమేజ్ ను అందించింది.

రమ్యకృష్ణ:

రమ్యకృష్ణ యాక్టింగ్ ఎప్పుడూ ఆపలేదు. వరుసగా సినిమాలు చేస్తూ అందరికీ పోటీ ఇస్తోంది. ఓ వైపు సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. మాజీ తమిళ సీఎం జయలలిత జీవితం ఆధారంగా ‘‘క్వీన్’’ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేసింది రమ్యకృష్ణ. ఎమ్.ఎక్స్ ప్లేయర్ ఒరిజినల్స్ లో ఈ సిరీస్ వచ్చి మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు పార్ట్ 2 కూడా ప్లానింగ్ లో ఉంది. ఈ సిరీస్ తో డిజిటల్ స్పేస్ లో కూడా తనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇలా అప్పటి స్టార్ హీరోయిన్లు ఓటీటీలో కూడా తమ మార్కు చూపెడుతూ రాణిస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ ఖాళీ లేకుండా పనిచేస్తూ... ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. పేమెంట్ కూడా సినిమాలకు తగ్గకుండా ఉండటంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సీనియర్ హీరోయిన్లే కాదు ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లు కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో సమంత, సాయిపల్లవి, కాజల్, తమన్నా, శృతి హాసన్, త్రిష, రాశిఖన్నా, రెజీనా, ఈషా రెబ్బా లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా లేకపోలేదు. సినిమాల్లో హీరోయిన్లుగా చేసుకుంటూనే మరోవైపు డిజిటల్ స్పేస్ లో కూడా అదరగొడుతున్నారు. హీరోయిన్లే కాదు.. ప్రస్తుతం హ్యాపెనింగ్ హీరోలు, సీనియర్ నటులకు కూడా ఓటీటీ మంచి ప్లాట్ ఫామ్ గా తయారైంది.