ముంబై: ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్లో రికార్డు స్థాయిలను తాకాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలుండడంతోపాటు, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. వీటితోపాటు ఎంఎస్ఈఐ(మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ఇండెక్స్) లో ఇండియా వెయిటేజి 70 బేసిస్ పాయింట్లు పెరగనుందని, ఇది పాక్షికంగా 2.5 బిలియన్ డాలర్ల ఇన్ఫ్లోలను సూచిస్తోందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ఎఫ్ఐఐ(విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) ఇన్ఫ్లో పెరుగుతుండడం వంటి అంశాల వలన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపడుతోంది. ఐటీ, మెటల్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్షేర్లు ర్యాలీ చేయడంతో సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ జీవిత కాల గరిష్టాలను తాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 413.45 పాయింట్లు లేదా 1.01 శాతం పెరిగి 41,352.17 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ పాజిటివ్గా కదలడంతో ఒకానొక దశలో 41,401.65 పాయింట్ల వద్ద ఆల్టైం గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 50 ఇండెక్స్111.05 పాయింట్లు లేదా 0.92 శాతం లాభపడి 12,165.00 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడే గరిష్టమైన 12,182.75 వద్ద ఆల్టైం గరిష్టాన్ని తాకింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ రాణించడంతో బ్యాంక్ నిఫ్టీ 32,213.35 వద్ద జీవిత కాల గరిష్టాన్ని తాకింది. ఈ రోజు సెషన్మొత్తం బుల్స్ ఆధీనంలోనే కొనసాగింది. కీలక ఇండెక్స్లు తమ జీవిత కాల గరిష్టాలను తాకాయి. బీఎస్ఈలో ప్రతి మూడు స్టాకులలో రెండు స్టాకులు పాజిటివ్గా కదిలాయి.
అంతర్జాతీయ సానుకూలత వలనే..
దీర్ఘకాలంగా కొనసాగిన ట్రేడ్వార్గత వారం ఓ ముగింపుకొచ్చింది. చైనా, అమెరికా నుంచి దిగుమతులను పెంచుకోనుండగా, దిగుమతులపై విధించుకున్న అదనపు సుంకాలను ఇరుదేశాలు నిలిపివేశాయి. దీంతో అంతర్జాతీయంగా మెటల్షేర్లు పుంజుకున్నాయి. నిఫ్టీ 50 లో టాటా స్టీల్(4.64 శాతం), భారతీ ఎయిర్టెల్(4.54 శాతం), వేదాంత(3.36 శాతం), హిందల్కో(3.31 శాతం), టాటా మోటర్స్(2.94 శాతం) షేర్లు టాప్గెయినర్లుగా ఉన్నాయి. సన్ఫార్మా(1.25 శాతం), గెయిల్(0.87 శాతం), బజాజ్ఆటో(0.66 శాతం), ఎం అండ్ఎం(-0.60 శాతం), టైటాన్(-0.40 శాతం) షేర్లు అధికంగా నష్టపోయిన షేర్లలో ముందున్నాయి. హెచ్డీఎఫ్సీ ట్విన్స్(హెచ్డీఎఫ్సీ 23.74 పాయింట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 15.14 పాయింట్లు), ఇన్ఫోసిస్(13.30 పాయింట్లు), ఐటీసీ(12.13 పాయింట్లు), టీసీఎస్(9.39 పాయింట్లు) షేర్లు నిఫ్టీలో టాప్కంట్రిబ్యూటర్లుగా ఉన్నాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్0.38 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్0.66 శాతం పెరిగాయి. సెక్టార్ పరంగా చూస్తే 19 సెక్టార్ఇండెక్స్లలో 15 పాజిటివ్గానే ట్రేడయ్యాయి. టెలికాం సెక్టార్, ఐటీ సెక్టార్ ఇండెక్స్లు అధికంగా లాభపడ్డాయి. ఎక్సేంజ్ సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) రూ. 728.13 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశియ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐ) రూ. 796. 38 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.