క్రాస్​ ఓటింగ్​ ఎవరికి లాభం?

క్రాస్​ ఓటింగ్​ ఎవరికి లాభం?
  •     ఆందోళనలో ప్రధాన పార్టీల అభ్యర్థులు
  •     గెలుపోటములపై నియోజకవర్గ, మండల నేతలతో చర్చలు  

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు : ఖమ్మం లోక్​సభకు జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లలో క్రాస్​ ఓటింగ్​ భారీగా జరిగింది. క్రాస్​ ఓటింగ్​ ఎవరికి లాభం అనే అంశంపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్​ఎస్​ అభ్యర్థులు, ముఖ్యమైన లీడర్లు తమ అనుచరులతో చర్చిస్తున్నారు. ఏ ఏ నియోజకవర్గాల్లో ఎక్కువగా క్రాస్​ ఓటింగ్​ జరిగిందనే విషయమై ఆయా  పార్టీల ఇన్​చార్జీలు ఆరా తీస్తున్నారు. పోలింగ్​ తీరుపై, గెలుపోటములపై లెక్కలేసుకుంటున్నారు. 

ఎక్కడ.. ఏ పరిస్థితి? 

ఖమ్మంలో కాంగ్రెస్​ ఓట్లు బీఆర్​ఎస్​, బీజేపీకి క్రాస్​అయ్యాయి. అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ ఓట్లు కొంత వరకు బీజేపీకి క్రాస్​ అయ్యాయి. టీడీపీ ఓట్లు బీజేపీకి పడాల్సి ఉన్నప్పటికీ ఎక్కువ శాతం బీఆర్​ఎస్, కాంగ్రెస్​కు పడడం గమనార్హం.  కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ ఓట్లు కాంగ్రెస్​, బీజేపీలకు బదిలీ అయ్యాయి.  వైరా నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ ఓట్లు కాంగ్రెస్​ కు క్రాస్​ అయ్యాయి. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​కు చెందిన కొంత మేర ఓట్లు బీజేపీకి క్రాస్​ కావడం గమనార్హం. ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ ఓట్లు కొంత మేర బీజేపీకి పడ్డాయి. 

బీఆర్​ఎస్​ ఓట్లు కొన్ని కాంగ్రెస్​కు బదలాయింపు జరిగాయి.  భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ ఓట్లు కాంగ్రెస్​కు క్రాస్​ అయ్యాయి.  పినపాక నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ ఓట్లు బీజేపీకి ఎక్కువగా క్రాస్​ అయ్యాయి. కాంగ్రెస్​ ఓట్లు కూడా కొన్ని బీజేపీకి పడడం గమనార్హం. అయితే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో విధంగా క్రాస్​ ఓటింగ్​ ఉండడంతో ఏ పార్టీకి లాభం కలుగుతుందో అర్థం కాని పరిస్థితి నేతల్లో నెలకొంది. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 2,81,997 మంది ఓటు వేయలె

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లోక్​ సభ ఎన్నికల్లో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో దాదాపు 2,81,997 మంది ఓటు వేయలేదు. ఐదు నియోజకవర్గాలకు గానూ జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గం పోలింగ్​లో చివరన నిలువగా, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం టాప్​లో నిలిచింది. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల కన్నా పార్లమెంట్​ ఎన్నికల్లో పోలింగ్​శాతం తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాలకు గానూ 9,67,171 మంది ఓటర్లు ఉండగా, 7,80,49 మంది ఓటేశారు. లోక్ సభ ఎన్నికల్లో 9,88,238 మంది ఓటర్లు ఉండగా, 7,06,241 మంది ఓటేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్​ సభ ఎన్నికల్లో ఓటర్లు పెరిగారు.. కానీ ఓటేసిన వారి సంఖ్య మాత్రం తగ్గడం గమనార్హం.