
- ఉత్తర కన్నడ జిల్లాలో ఘోరం
బెంగళూరు: కర్నాటకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ కొండచరియలు విరిగిపడి ఏడుగురు వ్యక్తులు మరణించారు. మృతిచెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ఉత్తర కన్నడ జిల్లాలోని షిరూర్లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు 66వ నంబర్ నేషనల్ హైవే పక్కన చిన్న దుకాణం నడుపుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. కొండపై నుంచి పెద్ద ఎత్తున వచ్చిన మట్టిలో కుటుంబ సభ్యులు చిక్కుకుపోయి ఉంటారని వారు పేర్కొన్నారు.
అలాగే, కొండచరియలు విరిగిపడడంతో ఓ గ్యాస్ ట్యాంకర్ కూడా గంగావళి నదిలో పడిపోయినట్టు తెలిసింది. అంతేకాకుండా ఘటన జరిగిన సమయంలో దుకాణంలో టీ తాగుతున్న ఓ వెహికల్ డ్రైవర్, క్లీనర్ కూడా కనిపించకుండా పోయారని స్థానిక అధికారులు తెలిపారు. పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ అంశాన్ని కార్వార్ ఎమ్మెల్యే సతీశ్ సైల్ అసెంబ్లీలో లేవనెత్తారు.