
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం (జనవరి 21) రెండో వన్టే జరగనుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఇప్పటికే మొదటిమ్యాచ్లో నెగ్గిన టీమిండియా.. రెండో వన్డేలో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు రెండో వన్డేలో గెలిచి రేసులో ఉండాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఈ ఆసక్తికర పోరుకు రాయ్పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఈ స్టేడియం మొదటిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తోంది.
అయితే ఈ స్టేడియంలో గతంలో మొత్తం ఆరు ఐపీఎల్ మ్యాచ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 మ్యాచ్లు జరిగాయి. ఐపీఎల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 2 సార్లు గెలవగా, 4 సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టును విజయం వరించింది. ఈ లెక్కన చూస్తే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ అత్యధిక స్కోర్(164) చేయగా.. అత్యల్ప స్కోరు చెన్నై సూపర్ కింగ్స్ (119) చేసింది. ఇక్కడి పిచ్ ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.