శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్యాసింజర్ అరెస్ట్
శంషాబాద్, వెలుగు: చీరలకు గోల్డ్ స్ర్పే కొట్టి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్యాసింజర్ను శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఓ ప్యాసింజర్.. బంగారాన్ని స్ర్పే రూపంలో మార్చి దాన్ని చీరలకు కొట్టి తీసుకొచ్చాడు. అతడి లగేజీని స్కాన్ చేసిన కస్టమ్స్ అధికారులు బంగారం పూత పూసిన చీరలను గుర్తించారు.
ప్యాసింజర్ను అదుపులోకి తీసుకున్నారు. 461 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 26 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ప్యాసింజర్పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.