శంషాబాద్ ఎయిర్ పోర్టుకు హై అలర్ట్..అప్పటి వరకు రావొద్దు..

 శంషాబాద్ ఎయిర్ పోర్టుకు హై అలర్ట్..అప్పటి వరకు రావొద్దు..

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సెక్యూరిటీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టు ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా సంస్థలు సెక్యూరిటీని అలర్ట్ చేశాయి.  సిఐఎస్ఎఫ్ స్పెషల్ పోలీస్, స్టేట్ పోలీస్ లను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. దీంతో ఎయిర్ పోర్టుకు వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అధికారులు లోనికి అనుమతిస్తున్నారు. 

అప్పటి వరకు రావొద్దు..

మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో సందర్శకులకు అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఆగస్ట్ 28 తేదీ వరకు సందర్శకులను అనుమతించబోమని స్పష్టం చేశారు. అప్పటి వరకు విజిజింగ్ పాసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఎక్కువ మంది రావొద్దు..

శంషాబాద్ విమానాశ్రయం నుండి విదేశాలకు వెళుతున్న వారి వెంట ఎక్కువ సంఖ్యలో బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు రావోద్దని శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి సూచించారు.
ఒక్క ప్రయాణికుని వెంట పది నుండి 15 మంది వరకు రావడంతో ఎయిర్ పోర్టులో రద్దీ పెరిగిందన్నారు. దీని వల్ల సెక్యూరిటీ సమస్యతో పాటు..పార్కింగ్ సమస్యలు ఎక్కువయ్యాయని తెలిపారు. ఒక ప్రయాణికుడి వెంట ముగ్గురు లేదా నలుగురు మాత్రమే ఎయిర్ పోర్టుకు రావాలని సూచించారు.