యాదాద్రిలో శిల్పారామం ప్రారంభం

యాదాద్రిలో శిల్పారామం ప్రారంభం

యాదాద్రి, వెలుగు : భువనగిరి మండలం రాయగిరిలోని రెండెకరాల్లో నిర్మించిన శిల్పారామాన్ని  భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి, ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం శిల్పారామంలోని సరస్సులోని బోటులో కొద్దిసేపు తిరిగారు. చేనేత, హస్త కళలకు సంబంధించిన స్టాల్స్​ను సందర్శించారు. ఆయా స్టాల్స్​లోని వస్తువులను పరిశీలించారు. సురభి నాటకాన్ని తిలకించారు.

పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటవస్తువులను చూశారు. అనంతరం వారు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గుట్టలో నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో ఆనందంగా గడపడానికి శిల్పారామం ఏర్పాటు చేసిందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన చేనేత, హస్త కళల స్టాల్స్​లోని వస్తువులను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు ఉన్నారు.

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధికారులను ఆదేశించారు. తుర్కపల్లి మండలం తిర్మలాపూర్ లో సీఎం రేవంత్ బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్లు భాస్కర్ రావు, వీరారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో దాదాపు రూ.1500 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రూ.700 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.183 కోట్లతో మెడికల్ కాలేజ్ సహా పలు అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్ ఆవిష్కరించి వర్చువల్ గా డెవలప్​మెంట్ వర్క్స్ ను సీఎం ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా 50 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ పర్యటన ముగించుకుని వెళ్లేంతవరకు అధికార, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి వెంట ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్యామహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, తహసీల్దార్ దేశ్యానాయక్ పాల్గొన్నారు.