
- కేడర్ స్ట్రెంత్ ఇవ్వకుండానే దవాఖాన్లను అప్గ్రేడ్ చేసిన గత సర్కార్
- ఇతర ఆస్పత్రుల నుంచి స్టాఫ్ను డిప్యూట్ చేసి నడిపిస్తున్న ఆఫీసర్లు
- జ్వరాల సీజన్ కావడంతో పెరుగుతున్న రోగుల రద్దీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్లలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. వైద్య విధాన పరిషత్ పరిధిలోని 70 ఆస్పత్రుల్లో కనీసం ఒక్కరంటే ఒక్క రెగ్యులర్ ఉద్యోగి కూడా లేరు. సుమారు 3,800 బెడ్ల కెపాసిటీ కలిగిన ఈ 70 ఆస్పత్రులను రెగ్యులర్ స్టాఫ్ లేకుండానే కొనసాగిస్తున్నారు. ఈ హాస్పిటళ్లకు పోస్టులు శాంక్షన్ చేయడంలో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేయగా, ఇప్పుడూ అదే వైఖరి కొనసాగుతున్నది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పరిధిలో ఉన్న 83 పీహెచ్సీలను కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ అప్గ్రేడ్ చేసి, వైద్య విధాన పరిషత్ పరిధిలోకి తీసుకొచ్చింది.
అప్పటివరకూ ఆయా హాస్పిటళ్లలో పనిచేసిన డాక్టర్లు, ఇతర సిబ్బందిని కొన్నాళ్లపాటు కొనసాగించిన ప్రభుత్వం, ఆ తర్వాత వాళ్లందరినీ ఇతర పీహెచ్సీలకు బదిలీ చేసింది. మొత్తం 83 దవాఖాన్లను అప్గ్రేడ్ చేసిన బీఆర్ఎస్, అందులో13 దవాఖాన్లకు కొత్త బిల్డింగ్లను, పోస్టులను మంజూరు చేసింది. మిగిలిన హాస్పిటళ్ల సంగతిని గాలికొదిలేసింది. దీంతో వైద్య విధాన పరిషత్ అధికారులు ఇతర హాస్పిటళ్ల నుంచి డాక్టర్లు, నర్సులను ఆ హాస్పిటళ్లలోకి డిప్యూట్ చేసి మేనేజ్ చేస్తూ వచ్చారు.
ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆ హాస్పిటళ్ల పరిస్థితి అలాగే కొనసాగుతున్నది. ఈ సర్దుబాట్ల కారణంగా ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. జ్వరాల సీజన్ కావడంతో అన్ని హాస్పిటళ్లకు రోగులు పోటెత్తుతున్నారు. ఇన్నాళ్లు ఎలాగోలా మేనేజ్ చేసినప్పటికీ, పేషెంట్ల రద్దీ పెరగడంతో ఇప్పుడు ప్రభుత్వానికి జనాలు, స్థానిక నాయకుల నుంచి ఫిర్యాదులు వెళ్తున్నాయి.
2,590 పోస్టులు కావాలి
ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్ ప్రకారం ఈ 70 హాస్పిటళ్లలో పని చేయడానికి, ఒక్కో హాస్పిటల్లో 14 మంది చొప్పున 980 మంది డాక్టర్లు అవసరం. 980 మంది స్టాఫ్ నర్సులు, 70 మంది హెడ్ నర్సులు ఉండాలి. అలాగే, 490 మంది పారామెడికల్ స్టాఫ్, 70 మంది జూనియర్ అసిస్టెంట్లు కావాలని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వీవీపీ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇవే ప్రతిపాదనలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా అందజేశారు. కానీ, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు పర్మిషన్ రాలేదు.