హుస్నాబాద్, వెలుగు: మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన కోట్ల విలువైన భూమిని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గుబ్బడి గ్రామానికి చెందిన మాజీ అధ్యక్షుడు మెడబోయిన రాజయ్య, ఆయన కుటుంబ సభ్యులు తమ పేరిట పట్టా చేసుకున్నారని సంఘం అధ్యక్షుడు సమ్మెట వెంకటయ్య తెలిపారు.
సోమవారం హుస్నాబాద్ ఆర్డీవో ఆఫీస్లో నిర్వహించిన ప్రజావాణికి మత్స్య సంఘం సభ్యులు నాలుగు ట్రాక్టర్లలో తరలివచ్చారు. ఆఫీస్ ఎదుట బైఠాయించి ఆర్డీవో వచ్చి వినతిపత్రం తీసుకోవాలని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ సీఐ శ్రీధర్, ఎస్సై లక్ష్మారెడ్డి, అక్కన్నపేట ఎస్సై ప్రశాంత్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఆర్డీవో రామ్మూర్తిని కలసి వినతిపత్రం అందజేయగా, విచారణ జరిపి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
