
- ఆఫీసర్లు, ఉద్యోగులకు సింగరేణి సీఎండీ బలరామ్ వార్నింగ్
గోదావరిఖని/కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థలో డ్యూటీకి రాకుండా మస్టర్(అటెండెన్స్) పడితే వారిపై వేటు వేయక తప్పదని, అటెండెన్స్ పడ్డాక ఆఫీసు దాటితే ఉపేక్షించేది లేదని సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ నాయక్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం అన్ని ఏరియాల జీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. భూగర్భ గనుల్లో ప్రతి రోజూ అధికారులు పని ప్రదేశాలను తనిఖీ చేయాలని, కంపెనీ మనుగడ సాగాలంటే పని సంస్కృతి మరింత మెరుగుపడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
సింగరేణిలో ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ సీఎండీ ఇప్పుడు కంపెనీలో వర్క్ కల్చర్ పెంచేందుకు కీలక చర్యలకు పూనుకున్నారు. గనులు, ఆఫీసుల్లో పని చేస్తున్న కొందరు డ్యూటీలకు రాకున్నా మస్టర్ పడుతున్నట్లు, మరి కొందరు మస్టర్ పడి బయటకు వెళ్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఆయన తీవ్రంగా స్పందించారు.
సింగరేణిలో ఉద్యోగులు, అధికారులంతా ఇకపై రోజూ తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేసుకోవాలని, దీనిపై ఆయా ఏరియా జీఎంలు, డిపార్ట్మెంట్ల హెచ్వోడీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. లంచ్ బ్రేక్లో చాలా మంది 3 గంటల పాటు విరామం తీసుకోవడం ద్వారా తమ పనులు, ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయని పలువురు సీఎండీ దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో దీనిపై ఆయన సెక్యూరిటీ విభాగం ద్వారా నివేదికలు తెప్పించుకుని ఈ ఆదేశాలిచ్చారు.
సింగరేణిలోని ప్రతి ఉద్యోగి, అధికారి సమయపాలన పాటించాలని, డ్యూటీలో చేరిన తర్వాత బయటకు వెళ్లడం, పని చేయకుండా కూర్చోవడం చేయవద్దని, ఈ విషయంలో ఎంతటి పెద్ద వారైనా, పలుకుబడి ఉన్నవారైనా సరే ఉపేక్షించేది లేదని సీఎండీ హెచ్చరించారు.
కార్పొరేట్ ఆఫీస్లో 32 మంది ఆలస్యంగా..
ఈ క్రమంలో మంగళవారం కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీస్లో డ్యూటీకి ఆలస్యంగా వచ్చిన, లంచ్కు వెళ్లి ఆలస్యంగా చేరుకున్న 32 మంది ఉద్యోగుల వివరాలను సెక్యూరిటీ విభాగం ఆఫీసర్లు సేకరించి సీఎండీకి పంపించగా, వారిని మందలించారు. ఇకపై ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ నమోదు చేయడం జరుగుతుందని, ఉద్యోగుల వర్క్ కల్చర్ను పరిశీలించేందుకు అన్ని ఏరియాల జీఎంలు ఆఫీసుల్లో, గనుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని సీఎండీ ఆదేశించారు.
బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికులు 8 గంటలు పని చేస్తున్నారని, వారికి సంబంధించిన సంక్షేమం, ఇతరత్రా పనులను నిర్వర్తించే ఉద్యోగులు, అధికారులు మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులలో కొందరు ఏదో ఒక కారణం చూపి ఆఫీస్ వరండాల్లో తిరగడం, బయటికి వెళ్లడం, కబుర్లతో కాలక్షేపం చేస్తే సంబంధిత హెచ్వోడీలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. క్రమశిక్షణ గల సంస్థగా సింగరేణిని రూపుదిద్దడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.