బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాలబస్తిలో తమపై పోలీస్ కేసు పెట్టాడని రిటైర్డ్ సింగరేణి కార్మికుడిని అతడి కుటుంబసభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో రెండు రోజులుగా రోడ్డు పక్కన ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ చిన్న చెట్టు కింద తలదాచుకున్నాడు. నక్క రాయలింగు అనే సింగరేణి కార్మికుడు ఆరేండ్ల కింద రిటైర్డ్ అయ్యాడు. కొన్ని కారణాలతో కుటుంబసభ్యులతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లి పోయాడు.
గొడవలు పోలీస్ కేసుల దాక వెళ్లాయి. కాగా, ఇటీవల కాలుకు దెబ్బతగలడంతో అరికాలు పాదం పూర్తిగా పాయిజన్ అయ్యింది. కష్ట కాలంలో ఉన్న తనను కాపాడాలని కుటుంబసభ్యులను వేడుకున్నా.. వారు వినకుండా ఇంటి గేటుకు తాళం వేసుకున్నారు. కని పెంచిన పిల్లలు, కట్టుకున్న భార్య కూడా పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవికి, బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించు కోవడం లేదని ఆరోపించాడు. కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.