
బషీర్బాగ్, వెలుగు: తెలుగు సాహిత్యంలో సినారే అక్షర సేద్యం చేశారని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కొనియాడారు. కోఠిలోని మహిళా వర్సిటీ దర్బార్ హాల్లో శనివారం నిర్వహించిన సినారే సాహిత్య ఉత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య ఎన్ గోపితో కలిసి ‘స్మరణ వేళ’లో అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
సినారే బీఏ వరకు ఉర్దూలో చదువుకొని కూడా తెలుగులో ప్రపంచ ప్రఖ్యాతి వహించే స్థానానికి చేరుకోవడానికి కారణం ఆయనలోని సహజ కవిత్వ లక్షణమేనని హైకోర్టు జడ్జి జస్టిస్ జి. రాధారాణి అన్నారు. ఉత్సవం ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సినారే అగ్రిశ్రేణి కవిగా కావ్యాలు రచిస్తూనే.. కలకాలం నిలిచిపోయే సినీ గీతాలు రచించారన్నారు.
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ సాధారణంగా ఎవరినైనా సమకాలీకులు మెచ్చరని, కానీనారాయణరెడ్డికి అందరి మన్ననలు లభించాయన్నారు. సినారే విశ్వంభర దీర్ఘకావ్యం పంజాబీ, మలయాళ అనువాదాలను, ప్రపంచపదులు తమిళ అనువాదాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించి అనువాదకులను సత్కరించారు. సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి జె. చెన్నయ్య పాల్గొన్నారు.