- పీసీబీ సభ్య కార్యదర్శి గుగులోత్ రవి
హైదరాబాద్ సిటీ, వెలుగు: పరిశ్రమలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలని టీజీపీసీబీ సభ్య కార్యదర్శి గుగులోత్ రవి సూచించారు. హైదరాబాద్ ఫెడరేషన్ హౌస్లో ఎఫ్టీసీసీఐ, ఫిక్కీ, టీజీపీసీబీ ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తను నాలుగు భాగాలుగా విభజించి.. తడి, పొడి, ప్రమాదకర గృహ వ్యర్థాలు, తిరిగి వినియోగించలేనివిగా గుర్తించాలన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వ్యర్థాలను సక్రమంగా వేరు చేయని ఇండ్లు, వాణిజ్య సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం స్థానిక సంస్థలకు ఉందన్నారు.
ఫిక్కీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ సహాధ్యక్షుడు జయదేవ్ మీలా మాట్లాడుతూ ప్రతి జిల్లా, ఎంఎస్ఎంఈల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు ఆర్.రవి కుమార్, ఈఎస్జీ కమిటీ సహాధ్యక్షుడు పి.బక్కా రెడ్డి, టీజీపీసీబీ జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ డి. నరేంద్ర, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణారావు, ఎఫ్టీసీసీఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్వరి పాల్గొన్నారు.
