- అందులో కాంగ్రెస్, బీజేపీ నేతలు,
- హైకోర్టు జడ్జీలు సహా 6 వేల మంది వివరాలు
- ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా ప్రభాకర్రావును ప్రశ్నిస్తున్న సిట్
- ఆ ప్రొఫైల్స్ ఎందుకు సేకరించారు? వాళ్ల ఫోన్లూ ట్యాప్ చేశారా? అని ప్రశ్నల వర్షం
- ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపటితో ముగియనున్న ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ టెక్నికల్ఆధారాలతో ముందుకెళ్తున్నది. ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు వినియోగించిన మూడు సెల్ఫోన్లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ ద్వారా సేకరించిన పెన్డ్రైవ్ డేటా ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలిసింది. ఆ పెన్డ్రైవ్లో 6 వేల మంది ప్రొఫైల్స్ ఉన్నట్టు సమాచారం. ఎవరి ఆదేశాల మేరకు అంతమంది ప్రొఫైల్స్సేకరించారు? ఆ వివరాలు ఎందుకు సేకరించారు? వాళ్లందరి ఫోన్లు కూడా ట్యాప్చేశారా? అనే కోణంలో ప్రభాకర్రావును సిట్ ప్రశ్నిస్తూ సమాధానాలు రాబడుతున్నట్టు తెలిసింది. కాగా, ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ శుక్రవారంతో ముగియనున్నది.
పెన్డ్రైవ్లో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ డేటా..
గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నోళ్లను కట్టడి చేసేందుకు ఎస్ఐబీ కేంద్రంగా ప్రణీత్రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ టీమ్ను ఏర్పాటు చేశారు. బేగంపేటలోని ఎస్ఐబీ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఎస్వోటీ లాగర్ రూమ్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు సహా రాష్ట్రంలోని కీలక నాయకులు, మీడియా, సినీ ఇండస్ట్రీ ప్రముఖుల ఫోన్ నెంబర్లతో ప్రణీత్రావు టీమ్ ప్రత్యేక ప్రొఫైల్స్ రూపొందించింది. ఈ క్రమంలోనే ఓ మహిళా జడ్జి, ఓ కోర్టు జడ్జి దంపతులు సహా పబ్లిక్ డొమైన్లో ఉన్న హైకోర్టు జడ్జీల వివరాలను సేకరించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. 16 మంది జడ్జీలకు సంబంధించిన ప్రొఫైల్స్ పెన్డ్రైవ్లో ఉన్నట్టు సమాచారం. మొత్తం 6 వేల మందికి పైగా ప్రొఫైల్స్ను ఎస్వోటీ టీమ్ తయారు చేసినట్టు తెలిసింది. దాదాపు 4,200కు పైగా ఫోన్ నెంబర్లతో ప్రొఫైళ్లను క్రియేట్ చేసినట్టు సిట్ గుర్తించింది. ప్రణీత్రావు టీమ్ ధ్వంసం చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ హార్డ్ డిస్క్ల్లో మరో 2 వేలకు పైగా ఫోన్ నంబర్లు, వ్యక్తిగత సమాచారం ఉన్నట్టు ఆధారాలు సేకరించింది. అలాగే ప్రభాకర్ రావు సహా ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉన్న అధికారులు, రాజకీయ పార్టీల నేతల కుట్రలకు సంబంధించిన కీలక ఆధారాలు పెన్డ్రైవ్లో ఉన్నట్టు తెలిసింది.
ప్రొఫైల్స్ మాత్రమేనా? ట్యాపింగ్ చేశారా?
పెన్డ్రైవ్లో దొరికిన 6 వేల మంది వివరాలతో ప్రొఫైల్స్ మాత్రమే క్రియేట్ చేశారా? లేక వాళ్ల ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేశారా? అనే కోణంలో సిట్ ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. మరోవైపు డేటా ప్రొఫైలింగ్ వవ్యహారంలో నాటి సీఎం కేసీఆర్ పర్సనల్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి నుంచి సిట్ కీలక వివరాలను రాబట్టినట్టు తెలిసింది. కేసీఆర్ను విచారించేందుకు అవసరమైన న్యాయసలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం.
