యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట అనుబంధమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట దేవస్థానం తరఫున చైర్మన్ నరసింహమూర్తి దంపతులు, ఈవో భవానీ శంకర్ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎదుర్కోలు ఉత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల పాటు కల్యాణాన్ని జరిపించారు.
శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం, రాత్రి 8 గంటలకు డోలోత్సవం, ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు సత్యనారాయణ వ్రతం నిర్వహించనున్నారు. సోమవారం కంకణ విమోచనంతో శ్రీరామనవమి వసంత నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. కార్యక్రమంలో ఏఈవోలు గజవెల్లి రఘు, నవీన్, పర్యవేక్షకులు సురేందర్రెడ్డి, శివాలయ ప్రధానార్చకులు గౌరీభట్ల నరసింహరాములు, పురోహితులు శ్రీనివాస్శర్మ, సత్యనారాయణశర్మ పాల్గొన్నారు.
