
పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులో విషాదం చోటు చేసుకుంది. వనభోజనాలకని వచ్చి సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వసంతవాడ సమీపంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెడితే..వేలేరుపాడు మండలం భూదేవిపేట గ్రామానికి చెందిన కొందరు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లారు. సరదాగా వాగులో ఈత కొడదామని మనోజ్, రాధాకృష్ణ, రంజిత్, శివాజి, గంగాధర్ వెంకట్, భువన్ లు వాగులోకి దిగారు. వాగు ఉదృతికి వీరంతా కనిపించకుండా పోయారు. వీరంతా 16, 18 యేళ్ల వయసువారే . పిల్లలు గల్లంతు కావడంతో వారితో వచ్చిన మిగతావారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై టి. సుధీర్ ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు.ఇప్పటివరకు గంగాధర్ వెంకట్, శివాజి, రాధాకృష్ణ, రంజిత్ మృతదేహాలు దొరికాయి. మరో ఇద్దరి ఆచూకీ తెలియలేదు. వీరికోసం గాలింపు కొనసాగుతుంది.