ఇండోనేసియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం. లక్షల్లో జీతం. కరోనా వల్ల ఏడాది నుంచి వర్క్ఫ్రమ్ హోమ్ చేస్తున్నడు. ఖాళీ టైంలో ఏదైనా చేయాలనుకున్నడు. తాతముత్తాతల కాలం నుంచి ఉన్న బీడు భూమి గుర్తొచ్చింది. ఏదైనా డిఫరెంట్గా చేయాలి అన్నుకున్నడు భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకు చెందిన మహ్మద్ అబ్దుల్మక్బూల్. డ్రాగన్ ఫ్రూట్ పండిస్తే బాగుంటుంది అనుకున్నాడు ఈ ఇంజినీర్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి లాంటివే సాగు చేస్తారు. కానీ, మహమ్మద్ అబ్దుల్ మక్బూల్ కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించాడు. మన్యం జనానికి సరికొత్త పంటలను పరిచయం చేశాడు. డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తున్నాడు. అబ్దుల్ది బూర్గంపాడు. ఇండోనేసియాలోని ‘ఇంటర్ బయో’ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కరోనా వల్ల వర్క్ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. బూర్గంపాడు మండలంలోని సంజీవరెడ్డిపాలెంలో వాళ్లకు ఉన్న13 ఎకరాల బీడు భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని డిసైడ్ అయ్యాడు. తండ్రి పేపర్ ఫ్యాక్టరీలో ఉద్యోగి, తను సాఫ్ట్వేర్ ఉద్యోగి వ్యవసాయం గురించి ఇద్దరికీ తెలియదు. అయినా వెనుకడుగు వేయలేదు. డ్రాగన్పంట సాగుపై యూట్యూబ్లో స్టడీ చేశాడు. గతంలో ఇండోనేసియాలో డ్రాగన్ ఫ్రూట్ ఫామ్స్లో తిరిగిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. ఆంధ్రాలోని గుంటూరు, మన రాష్ట్రంలోని సంగారెడ్డి ప్రాంతాలకు వెళ్లి అక్కడ డ్రాగన్సాగు చేస్తున్న తీరును స్టడీ చేశాడు. తమ భూమిలోని మట్టిని కొత్తగూడెంలోని సాయిల్టెస్ట్ సెంటర్లో టేస్ట్ చేయించుకుని.. డ్రాగన్ సాగుకు అనుకూలమా? కాదా? తెలుసుకున్నాడు.
అసలు సమస్య ఇక్కడే..
సాగు చేయాలనుకున్న భూమిలో బోర్ లేదు. చుట్టుపక్కల రైతులు ఎన్నిసార్లు బోర్లు వేసినా లాభం లేకుండా పోయింది. పొలంలో బోరు వేసుకోవాలంటే లేటెస్ట్ పాస్బుక్ , పాత పహానీలు అడిగారు అధికారులు. అవి లేవు. ఎన్ఓసీ ఉంటేనే కరెంటు కనెక్షన్ ఇస్తామని ట్రాన్స్కో అధికారులు చెప్పారు. అప్పటికే రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి 3500 మొక్కల్ని తెప్పించాడు అబ్దుల్. అవి పాడవ్వకుండా ఉండాలంటే పంటను సాగు చేయాల్సిందే. ఎలా అయినా వ్యవసాయం చేయాలని పట్టుబట్టాడు. మొదట్లో తెలిసిన వాళ్ల ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించి మొక్కలకు పెట్టేవాడు. ఆ తర్వాత రూ.2లక్షలు పెట్టి సోలార్సిస్టమ్ ఏర్పాటు చేసి కరెంటు, బోరు వేయించుకున్నాడు. డ్రిప్ ఇరిగేషన్ చేస్తూ పంట సాగు చేస్తున్నాడు. ఒకసారి పెట్టుబడి పెడితే 20 ఏండ్ల పాటు సాగు చేసుకోవచ్చు అంటాడు అబ్దుల్. ఇప్పటివరకు రూ.14 లక్షలు ఖర్చు అయ్యిందని, పంట బాగా పండుతుందని పెట్టిన పెట్టుబడి మూడేండ్లలో వచ్చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
అన్నీ స్టడీ చేసి
అమ్మనాన్న ఒకసారి ఇండోనేసియా వచ్చినప్పుడు రెస్టారెంట్కు వెళ్లాం. డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ వాళ్లకు చాలాబాగా నచ్చింది. అప్పటినుంచి ఆ ఫ్రూట్ గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా. 2020 డిసెంబరులో ఇండోనేసియా నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. అన్ని ప్రాంతాలకు వెళ్లి డ్రాగన్ఫ్రూట్సాగు గురించి స్టడీ చేశాను. ట్రిలీస్ వైరింగ్ విధానం ద్వారా మొక్కలు నాటాను. ఈ విధానం వల్ల సాగు బాగుంటుంది. మొక్కలకు ఆక్సిజన్ కూడా బాగా అందుతుంది. - మహమ్మద్ అబ్దుల్ మక్బూల్