చేవెళ్ల/కంటోన్మెంట్, వెలుగు: ఓట్ల కోసం వచ్చే బీజేపీ, -బీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని, ఇనుప సలాకు కాల్చి వాతపెట్టాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘‘పదేండ్లు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తెలంగాణను పట్టించుకోలేదు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నరు. మోదీ పాలనలో వికసిత్ భారత్కాదు.. ఆకలి భారత్గా మారింది” అని తెలిపారు. ‘‘కేసీఆర్ ఊరూరు తిరిగినా.. ఇల్లు ఇల్లు తిరిగి అడుక్కున్నా.. తెలంగాణ సమాజం ఆయనను క్షమించదు. ఆయన కాళ్లు పైకి, చేతులు కిందికి పెట్టి తిరిగినా ప్రజలు నమ్మరు” అని అన్నారు. గురువారం రాత్రి సికింద్రాబాద్లోని బాలమ్రాయ్లో, రాజేంద్రనగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్స్లో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేసినందుకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తిత్తితీశారు. కారును ఖార్ఖానాకు పంపారు. ఇక కారు ఖార్ఖానా నుంచి సరాసరి తూకానికే పోతది” అని అన్నారు. కారు పైనైపోయిందని బస్సు వేసుకుని కేసీఆర్ బయలుదేరారని, ఆయన యాత్రకు వస్తుంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్లుందని విమర్శించారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏనాడైనా ప్రజలను కలిసిండా? సెక్రటేరియెట్కు వచ్చిండా? ప్రగతి భవన్ గేట్ల ముందు గద్దరన్నను నాలుగు గంటలు కూసోబెట్టిండు. అధికారం ఉన్నంత సేపు ఆంధ్ర కాంట్రాక్టర్లు, హైదరాబాద్ రియల్ఎస్టేట్వాళ్లే కేసీఆర్కు యాదికొచ్చిన్రు. ఇప్పుడు కారు ఖతం అయ్యేసరికి ప్రజలు గుర్తొచ్చినట్టు ఫామ్హౌస్ నుంచి బయటకు వచ్చిండు” అని రేవంత్ అన్నారు.
బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ
డెబ్బయ్యేండ్లుగాఅమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్రచేస్తున్నదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘‘బీజేపీ వాళ్లు నమో అంటున్నారు.. నమో అంటే నమ్మించి మోసం చేయడం. ఇయాళ తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి.. సిద్దిపేటలో అమిత్షా, మొన్న మధ్యప్రదేశ్లో మోదీ మాట్లాడుతూ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నరు. 400 సీట్లు వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నరు” అని మండిపడ్డారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని, వాళ్ల ఎజెండా బ్రిటీషోళ్ల ఎజెండా లెక్క ఉంటుందని విమర్శించారు. బీజేపీ నేతలు దేవుడిని అడ్డు పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ‘‘దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి..” అని చెప్పారు. ‘‘రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ, అమిత్ షా చెప్తున్నారు.. దీనికి చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఏం సమాధానం చెప్తారు?” అని ఆయన ప్రశ్నించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ను, మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్రెడ్డిని, చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డిని గెలిపించాలని రేవంత్రెడ్డి కోరారు.