సింగరేణి గనిలో కూలిన మట్టి .. ఇద్దరు కార్మికులు మృతి

సింగరేణి గనిలో కూలిన మట్టి .. ఇద్దరు కార్మికులు మృతి
  • మరో ఇద్దరికి గాయాలు 

  • ఆర్జీ3 ఏరియా ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో ఘటన  

  • విచారణకు సింగరేణి సీఎండీ ఆదేశం 

 గోదావరిఖని/రామగిరి/హైదరాబాద్, వెలుగు: సింగరేణి గనిలో మట్టి కూలి ఇద్దరు కార్మికులు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన రామగుండం రీజియన్​పరిధిలోని ఆర్జీ3 ఏరియా ఓపెన్​కాస్ట్​2 ప్రాజెక్ట్​లో జరిగింది. ఫిట్టర్​ఉప్పు వెంకటేశ్వర్లు (58), హెల్పర్లు గాదం విద్యాసాగర్​(48), మాదం సమ్మయ్య, వి.శ్రీనివాసరాజు బుధవారం సెకండ్​షిఫ్ట్ లో డ్యూటీకి వచ్చారు. వాళ్లు నలుగురు ప్రాజెక్ట్ క్వారీలోని సౌత్​ఏరియాలో హైవాల్​సంప్​వద్ద లీకేజీ అయిన పైపులైన్లను సరిచేసేందుకు వెళ్లారు. రిపేర్ చేస్తుండగా సాయంత్రం 6 గంటల సమయంలో వారిపై ఒక్కసారిగా మట్టి కుప్ప కూలింది.

ఒకవైపు పని చేస్తున్న వెంకటేశ్వర్లు, విద్యాసాగర్ పూర్తిగా మట్టిలో కూరుకుపోయారు. మరోవైపు పని చేస్తున్న సమ్మయ్య, శ్రీనివాసరాజుకు నడుము పైభాగం వరకు మట్టి వచ్చి చేరింది. ఇది గమనించిన తోటి కార్మికులు వెంటనే వచ్చి.. మెషిన్లతో మట్టిలో కూరుకుపోయిన వెంకటేశ్వర్లు, విద్యాసాగర్​ను బయటకు తీశారు. కానీ అప్పటికే వారు మరణించారు. గాయాలైన సమ్మయ్య, శ్రీనివాసరాజును మట్టికుప్పలో నుంచి బయటకు తీసి గోదావరిఖనిలోని సింగరేణి హాస్పిటల్​కు తరలించారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా.. విద్యాసాగర్​కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

తొలి ఏకాదశి రోజు ఇద్దరు కార్మికులు మృతి చెందగా, వారి కుటుంబసభ్యులు హాస్పిటల్​కు తరలివచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంకటేశ్వర్లుకు ఇంకా రెండేండ్ల సర్వీస్ ​ఉంది. తన కుమారుడికి డిపెండెంట్​ఉద్యోగం పెట్టించడానికి మెడికల్ అన్​ఫిట్ ​కోసం దరఖాస్తు చేసుకోగా, ఈలోపే ఆయన మృతి చెందారని తోటి కార్మికులు ఆవేదన చెందారు. 

ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు..  

ఈ ప్రమాదంలో సమ్మయ్య, శ్రీనివాసరాజు ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్లిద్దరికీ నడుము భాగం వరకు మట్టి చేరింది. దాంతో వారు గాయాలపాలయ్యారు. మరికొంత మట్టి జారి వారిమీద పడితే వారు కూడా ప్రాణాలు కోల్పోయేవారని తోటి కార్మికులు చెప్పారు. మట్టిలో కూరుకుపోయిన సమ్మయ్య, శ్రీనివాసరాజును తోటి కార్మికులు అతి కష్టం మీద బయటకు తీశారు.

‘‘మాకు నూకలు బాకీ ఉన్నయి. మా కండ్ల ముందే మట్టి కుప్ప కూలింది. మరోసారి మట్టి కూలితే మేం కూడా సచ్చిపోయేటోళ్ళమే’ అని శ్రీనివాసరాజు కంటతడి పెట్టుకున్నారు.  

ఆఫీసర్లను అరెస్ట్ చేయాలి: కార్మిక సంఘాలు 

సింగరేణిలో సేఫ్టీని పక్కనపెట్టి కేవలం బొగ్గు ఉత్పత్తిపైనే ధ్యాస పెట్టిన ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కార్మిక సంఘాల లీడర్లు డిమాండ్ చేశారు. సింగరేణి ఏరియా హాస్పిటల్​లో కార్మికుల మృతదేహాలను జడ్పీ చైర్మన్ ​పుట్ట మధు, సింగరేణి యూనియన్​లీడర్, మినిమమ్ ​వేజ్​అడ్వైజరీ బోర్డు చైర్మన్​ బి.జనక్​ప్రసాద్, ఎస్.నర్సింహరెడ్డి, మిర్యాల రాజిరెడ్డి, నూనె కొమురయ్య తదితరులు పరిశీలించారు.

కింద కందకంలో పనులు చేస్తున్నప్పుడు సైడ్​కు ఉన్న మట్టి కూలకుండా ఫెన్సింగ్​ వేయాలని, వర్షాకాలంలో మట్టికి సమీపంలో పనులు చేయించవద్దని రూల్స్​ ఉన్నప్పటికీ.. ఆఫీసర్లు వాటిని తుంగలో తొక్కి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వారు మండిపడ్డారు. 

కిషన్ రెడ్డి దిగ్ర్భాంతి.. 

ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కార్మికుల భద్రత కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులను ఆదేశిం చారు. కార్మికుల మృతిపై సింగరేణి సీఎండీ బలరాం విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబా ల‌‌‌‌కు అండగా ఉంటామని తెలిపారు. భ‌‌‌‌విష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జ‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌కుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.