
బందీపూర్: మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్లో తలైవా రజనీకాంత్కు గాయాలయ్యాయి. కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్లో షూటింగ్ సందర్భంగా ఆయన చీలమండ (యాంకిల్), భుజాలకు చిన్న గాయాలైనట్టు తెలుస్తోంది. బేర్ గ్రిల్స్ హోస్ట్ చేస్తున్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆయన తర్వాత ఆ షోలో పాల్గొంటున్న రెండో ఇండియన్ రజనీనే. షూటింగ్లో భాగంగా ఆయన లాంతానా ష్రబ్లో జారి పడ్డారని, ఆయన భుజాలకు స్క్రాచెస్ పడ్డాయని, యాంకిల్ బెణికిందని వైల్డ్లైఫ్ యాక్టివిస్ట్ జోసెఫ్ హూవర్ చెప్పారు. దీంతో కాసేపు షూటింగ్ను ఆపేశారన్నారు. రెస్ట్ తీసుకున్న తర్వాత రజనీ షూటింగ్ను పూర్తి చేశారని బందీపూర్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ బాలచందర్ చెప్పారు. ఆరు గంటల పాటు షూటింగ్ జరిగినట్టు చెప్పారు. మళ్లీ గురువారం షూటింగ్ జరుగుతుందని, అందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.