నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. అన్నం ఆలస్యంగా పెట్టిందని తల్లిని కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్లో జరిగింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని చైబాసాలోని మనోహర్పూర్ బ్లాక్ పరిధిలోని జోజోగుట్టు గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
ప్రధాన్ సోయి (35) అలియాస్ పవన్ సోయి తన తల్లి సుమి (60)తో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. పవన్ మద్యానికి బానిసగా మారి రోజూ తాగి వచ్చేవాడు. శుక్రవారం రాత్రి కూడా పవన్ పీకలదాకా తాగి ఇంటికొచ్చాడు.
మద్యం మత్తులో ఉన్న పవన్ తనకు అన్నం పెట్టాలని తల్లి సుమిని కోరాడు. అయితే రాత్రి సమయం కావడంతో సుమి అన్నం పెట్టడంలో కాస్త ఆలస్యం చేసింది. దాంతో కోపంతో ఊగిపోయిన పవన్ కర్రతో తల్లిపై దాడిచేశాడు. ఈ దాడిలో సుమి తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలిస్తే పోలీసులు అరెస్టు చేస్తారని భయపడిన పవన్.. తల్లి శవాన్ని ఇంటి ప్రాంగణంలోనే పూడ్చి పెట్టడానికి ప్రయత్నించాడు. అది గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. పవన్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ‘శుక్రవారం రాత్రి తాగి వచ్చిన పవన్.. తల్లిని అన్నం పెట్టాలని కోరాడు. తల్లి సుమి ఆలస్యం చేయడంతో.. పవన్ ఆమెను కర్రతో కొట్టి చంపాడు’ అని మనోహర్పూర్ ఎస్డిపిఓ విమలేష్ త్రిపాఠి తెలిపారు.
For More News..