
- ఆలస్యం చేస్తే తీవ్ర అన్యాయం జరుగుతది: సోనియా గాంధీ
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకూ కోటా కల్పిస్తూ ప్రొవిజన్లు పెట్టాలి
- ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లుకు మద్దతు ఇస్తున్నం
- ఈ బిల్లు పాస్ అయితే రాజీవ్ గాంధీ కల నెరవేరుతుందని సోనియా వ్యాఖ్య
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ మద్దతు ప్రకటించారు. అయితే బిల్లును ఆమోదించిన వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకూ కోటా ఇస్తూ నిబంధనలను పెట్టాలన్నారు. బుధవారం లోక్సభలో మహిళా బిల్లుపై చర్చను ప్రతిపక్షాల నుంచి సోనియా ప్రారంభించారు. రిజర్వేషన్లను అమలులోకి తీసుకురావడంలో ఏదైనా ఆలస్యం చేస్తే.. భారతీయ మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నా జీవిత భాగస్వామి రాజీవ్ గాంధీ.. నాడు స్థానిక సంస్థల్లో మహిళల భాగస్వామ్యం కోసం తొలిసారిగా రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టారు.
కానీ అది రాజ్యసభలో ఏడు ఓట్ల తేడాతో వీగిపోయింది. తర్వాత అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. ఆ ఫలితంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థలకు ఎన్నికయ్యారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ కల సగం మాత్రమే నెరవేరిందని, ఈ బిల్లు పాస్ అయినప్పుడే ఆయన కల పూర్తిగా నెరవేరుతుందని అన్నారు.
ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి?
‘‘మహిళా బిల్లును కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నది. సభ ఆమోదిస్తే సంతోషిస్తాం. కానీ మాకు ఆందోళనగా కూడా ఉంది. రాజకీయ బాధ్యతల కోసం గత 13 ఏండ్లుగా భారతీయ మహిళలు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్లను రెండేండ్లు, నాలుగేండ్లు, ఆరేండ్లు, ఎనిమిదేండ్లు ఎదురుచూడమని చెబుతున్నారు. భారతీయ మహిళల విషయంలో ఇలాంటి తీరు సరైనదేనా?” అని సోనియా గాంధీ ప్రశ్నించారు. బిల్లును వెంటనే అమల్లోకి తేవాలన్నదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని చెప్పారు. కుల గణన తర్వాత.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు కోటా ఇస్తూ ప్రొవిజన్లు పెట్టాలని స్పష్టం చేశారు.
మహిళ సహనాన్ని అంచనా వేయడం అసాధ్యం
పొగతో నిండిన వంట గదుల నుంచి ప్రకాశవంతమైన స్టేడియాల వరకు భారతీయ మహిళల ప్రయాణం సుదీర్ఘమైనదని సోనియా గాంధీ అన్నారు. చివరకు ఆమె తన గమ్యాన్ని చేరుకుందని చెప్పారు. ‘‘ఆమె జన్మనిచ్చింది, ఇంటిని నడిపింది, పురుషులతోపాటు వేగంగా పరిగెత్తింది. అనంతమైన ఓర్పుతో తరచుగా తనను తాను కోల్పోవడం చూసింది. కానీ చివరికి గెలిచింది” అని అన్నారు. ‘‘భారత మహిళల హృదయంలో సముద్రంలా ఓర్పు ఉంది.
అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయలేదు. తన ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. నదిలా అందరి సంక్షేమం కోసం పని చేసింది. కష్టకాలంలో హిమాలయాల మాదిరి దృఢంగా నిలిచింది. ఒక మహిళ సహనాన్ని అంచనా వేయడం అసాధ్యం. ఆమె ఎన్నడూ విశ్రాంతి తీసుకోదు. అలసిపోవడం ఎలాగో కూడా తెలియదు” అని చెప్పారు.
అప్పుడే మనం పాసైనట్లు!
‘‘మహిళ.. మన గొప్ప దేశానికి తల్లి. మనకు జన్మనివ్వడం మాత్రమే కాదు.. తన కన్నీళ్లు, రక్తం, చెమటతో మనల్ని పోషించడం ద్వారా మనల్ని ఆలోచించుకునేంత తెలివైన, శక్తిమంతులను చేసింది’’ అని సోనియా అన్నారు. మహిళల కష్టాన్ని, గౌరవాన్ని, త్యాగాన్ని గుర్తించడం ద్వారానే మనం మానవత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలమని చెప్పారు. ‘‘స్వాతంత్ర్య పోరాటంలో, కొత్త ఇండియాను క్రియేట్ చేయడంలో.. మహిళలు పురుషులతో పాటు పోరాడారు. అంతేతప్ప ఆశలు, ఇంటి పనుల భారం కింద సమాధి కాలేదు.
సరోజినీ నాయుడు, సుచేతా కృపలానీ, అరుణ ఆసఫ్ అలీ, విజయ లక్ష్మి పండిట్, రాజ్కుమారీ అమృత్ కౌర్, ఇంకా ఎన్నో లక్షల మంది మహిళలు దేశం కోసం పాటుపడ్డారు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబాసాహెబ్ అంబేద్కర్, మౌలానా ఆజాద్ కలలను సాకారం చేశారు. ఈ విషయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వ్యక్తిత్వం సజీవ ఉదాహరణ’’ అని వివరించారు.