ఇంటి వద్దకే రైల్వే సేవలు.. దేశంలోనే తొలిసారిగా ‘ రైల్వే పార్శిల్ యాప్’!

ఇంటి వద్దకే రైల్వే సేవలు.. దేశంలోనే తొలిసారిగా ‘ రైల్వే పార్శిల్ యాప్’!
  • రేపు ప్రారంభించనున్న రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ

హైదరాబాద్​సిటీ,వెలుగు: రైల్వే సేవలను ప్రజల ముంగిట్లోకే తీసుకు వచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ప్రజల ముంగిటకే  పార్శిల్ సేవలను చేర్చేలా ‘ రైల్వే పార్శిల్​యాప్​’ను అందుబాటులోకి తీసుకు వస్తున్నది. బుధవారం జీఎం సంజయ్ కుమార్​శ్రీవాస్తవ​ఈ యాప్‌‌ను అధికారికంగా ప్రారంభించనున్నారని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.  శ్రీధర్​తెలిపారు. ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లోనే ఈ సేవలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు.

ఇక్కడ వచ్చే స్పందనను బట్టి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని రైల్వే శాఖ నిర్ణయించిందని చెప్పారు. ప్రజలు తమ సరుకులను దేశంలోని ఏ ప్రాంతానికైనా ఈ యాప్ ద్వారా పార్శిల్ పంపవచ్చని పేర్కొన్నారు. అధికారులు నేరుగా క్లయింట్ల ఇంటికే వచ్చి సరుకులను సేకరించడంతో పాటు, గమ్యస్థానానికి డోర్ డెలివరీ కూడా చేస్తారని వెల్లడించారు. ఈ సేవల నిర్వహణ, లాజిస్టిక్స్ మార్కెట్‌‌పై అధ్యయనం చేసేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌‌మెంట్‌‌తో రైల్వే శాఖ ఎంఓయూ కుదుర్చుకుందని వివరించారు.

ఈ సంస్థ రైల్వే పార్శిల్స్, ఫ్రైట్​లాజిస్టిక్స్​ మార్కెట్‌‌పై స్టడీ చేసి నివేదిక ఇవ్వనుందని తెలిపారు.   పార్శిల్ బుకింగ్ సమయంలో యూపీఐ  ద్వారా సులభంగా పేమెంట్ చేసే సదుపాయం కల్పించామని చెప్పారు. వస్తువు బుక్ చేసినప్పటి నుంచి అది గమ్యస్థానానికి చేరే వరకు కస్టమర్లు తమ సెల్‌‌ఫోన్‌‌లో లైవ్ ట్రాకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పార్శిల్ రవాణా ఏ దశలో ఉందో కస్టమర్ మొబైల్‌‌కు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ వస్తుందని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా వ్యక్తులు, సంస్థలు,వ్యాపారులకు వేగవంతమైన, పారదర్శకమైన లాజిస్టిక్ సేవలు అందించడమే లక్ష్యమని అధికారులు వివరించారు.