కరోనా పేషెంట్ల మొబైల్స్ లో ప్రత్యేక యాప్

కరోనా పేషెంట్ల మొబైల్స్ లో ప్రత్యేక యాప్

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా పేషెంట్లపై వైద్యారోగ్యశాఖ నిఘా పెంచింది. వైరస్ బారిన పడిన వ్యక్తుల ఫోన్లలో మానిటరింగ్ యాప్‌‌ను ఇన్‌‌స్టాల్ చేయిస్తోంది. దీని ద్వారా వాళ్ల కదిలికలను పసిగడుతోంది. కొంతమంది పేషెంట్లు హాస్పిటల్‌‌ నుంచి పారిపోయే ప్రయత్నం చేయడం, వార్డుల్లో  తిరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే 30శాతం మంది బాధితుల ఫోన్లలో యాప్ ఇన్‌‌స్టాల్​  చేశామన్నారు.

స్విచ్ఛాఫ్ చేసినా పట్టేస్తది

కరోనా బాధితుల ఫోన్లలో యాప్ ఇన్‌‌స్టాల్ చేశాక పేషెంట్ పేరు, ఐడీ , బెడ్ నంబర్‌‌‌‌,  వార్డు నంబర్ ఎంటర్​ చేస్తారు. బెడ్ ఉన్న వార్డు లొకేషన్‌‌ను ట్యాగ్‌‌ చేస్తారు. ఆ వార్డు దాటి బయటకు వెళ్తే అలర్ట్‌‌ వచ్చేలా సెట్టింగ్‌‌ చేస్తారు. ఫోన్ కదిలే ప్రతి మీటర్‌‌‌‌నూ ఈ యాప్‌‌ లెక్కిస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా, లొకేషన్‌‌ ఆఫ్ చేసినా, ఫోన్‌‌ సిగ్నల్ ఆగిపోయినా హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌, పోలీస్, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు అలర్ట్ వెళ్తుంది. యాప్ నిర్వాహకులు సైతం ఎవరైనా లొకేషన్ దాటి వెళ్తే అధికారులను అలర్ట్ చేస్తారు. దీంతో పేషెంట్‌‌ వార్డులో లేకపోతే అతన్ని పట్టుకునే అవకాశం ఉంటుంది.

వాలంటీర్లుగా పేషెంట్లు

కరోనా బాధితుల్లో కొంతమంది డాక్టర్లకు సహకరిస్తుండగా, కొంత మంది ఒత్తిడితో పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో డాక్టర్లకు సహకరిస్తున్న వారిని వాలంటీర్లుగా నియమించారు. ఇలా ఒక్కో వార్డులో నలుగురైదుగురిని సెలెక్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. వార్డు దాటి ఎవరైనా బయటకు వెళ్తే వీళ్ల ఫోన్‌‌కూ అలర్ట్ వస్తుంది. అధికారులు వచ్చేలోగా పేషెంట్‌‌ పారిపోకుండా ఉండేందుకు వీళ్లు హెల్ప్‌‌ చేస్తారు.

5 వేల సార్లు అలర్టులు..

హోమ్‌‌ క్వారంటైన్‌‌లో ఉన్న మర్కజ్ రిటర్నీస్‌‌, వారితో కాంటాక్టయి ఇండ్ల వద్ద క్వారంటైన్‌‌లో ఉన్నవారందరి ఫోన్లలో ఈ యాప్‌‌ ఇదివరకే ఇన్‌‌స్టాల్ చేశారు. దీంతో ఇండ్ల నుంచి బయటకు వెళ్లిన వాళ్లను, ఇతర ప్రాంతాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన వాళ్లను గుర్తించామని అధికారులు తెలిపారు. సుమారు 5 వేలసార్లు అలర్ట్‌‌లు వచ్చాయని చెప్పారు. రూల్స్​బ్రేక్​ చేసిన వారిపై చర్యలు కూడా తీసుకున్నామన్నారు. సీఎం ఆఫీస్ నుంచి కింది స్థాయి ఏఎన్‌‌ఎం వరకు ఈ యాప్‌‌ వినియోగిస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్లకు సమాచారం అందుబాటులో ఉండేలా యాప్‌‌ను డిజైన్ చేశారు.