హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో పని చేస్తున్న మహిళ ఉద్యోగులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్న్యూస్ చెప్పారు. టీఎస్ ఆర్టీసీ మహిళల కోసం సోమవారం నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో మహిళా ఉద్యోగుల కోసం ‘మెట్రో ఎక్స్ప్రెస్ లేడీస్ స్పెషల్’ బస్సు అందుబాటులోకి తీసుకువచ్చింది.
జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ వరకు ఇది పైలట్ ప్రాజెక్టుగా ఇది మొదట నడవనుంది. నగర ఐటీ కంపెనీల్లో దాదాపు 5 లక్షల మంది వుమెన్ ఎంప్లాయ్స్ ఉన్నారు. ఫస్ట్ బస్సు జేఎన్టీయూ నుంచి ఉదయం 9.05 గంటల నుంచి బయల్దేరి బస్సు నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్స్పేస్, రాయదుర్గం, బయో డైవర్సిటీ, గచ్చిబౌలి క్రాస్ రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ ఎక్స్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా వెళ్తుంది.
సాయంత్రం 5.50 గంటలకు వేవ్ రాక్ నుంచి ఆయా మార్గాల ద్వారా జేఎన్టీయూకు చేరుకుంటుంది. ప్రయోగాత్మకంగా నడుపుతున్న ఈ సర్వీసు విజయవంతమైతే మరిన్ని మార్గాల్లో నడిపించాలని రోడ్డు రవాణా సంస్థ భావిస్తోంది.
ఈ బస్సుల్ని మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ఆయన ట్విటర్ లో షేర్ చేశారు.