వెటర్నరీ డాక్టర్ హత్య కేసు విచారణకై ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన క్రమంలో అందుకోసం స్పెషల్ యాక్షన్ తీసుకుంటున్నట్లు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటుపై హైకోర్టుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైన వెంటనే రోజు వారీ పద్దతిలో విచారణ జరిపి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వల్ల బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు కోర్టు ఏర్పాటుపై న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డితో మంత్రి ఇంద్రకరణ్ ఫోన్లో మాట్లాడారు.