సరదా ట్రిప్పు ఆమె జీవితాన్నేమార్చేసింది

సరదా ట్రిప్పు ఆమె జీవితాన్నేమార్చేసింది

‘కింద పడిందని కెరటాన్ని చూసి నవ్వకు.. అది ఉవ్వెత్తున ఎగసిన క్షణాన నువ్వు దాన్ని తల ఎత్తుకు చూడాల్సి వస్తుంది’ అన్న మాటను నిజం చేసేలా ఎదిగింది ఆమె. అందం ఉంటే చాలా, టాలెంట్ ఉండక్కర్లేదా అన్నా... నటన రాదు, డ్యాన్సూ రాదు వేస్ట్ అంటూ తీసి పారేసినా... బాధపడిందే గానీ కుంగిపోలేదు. నిరాశలో కూరుకుపోయి వెనకడుగూ వేయలేదు. తానేంటో చూపించాలనుకుంది. చూపించింది. బాలీవుడ్ స్టార్‌‌  హీరోలకి బెస్ట్ పెయిర్ అయ్యింది. బడా దర్శక నిర్మాతలకు ఫస్ట్ చాయిస్ అయ్యింది. ఆమే స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. 

 

లైఫ్ ని మార్చిన సరదా ట్రిప్

కత్రినా ఎక్కడో బ్రిటిష్ హాంగ్‌కాంగ్‌లో పుట్టింది. నాన్న మహ్మద్ కైఫ్ కశ్మీర్‌‌కి చెందినవాడు. బ్రిటన్‌లో స్థిరపడ్డాడు. తల్లి ఇంగ్లిష్ లాయర్. వారికి ఏడుగురు ఆడపిల్లలు. ముగ్గురు అక్కలకి, ముగ్గురు చెల్లెళ్లకి మధ్య పుట్టింది కత్రినా. విదేశాల్లోనే పుట్టి పెరగడం వల్ల అక్కడి అమ్మాయిలానే ఉంటుంది. అక్కడి భాషే మాట్లాడుతుంది. అలాంటి అమ్మాయి ఒక్కసారిగా మన అమ్మాయిగా మారిపోవాలంటే కష్టమే. అది తెలిసి కూడా చాలామంది కత్రినాని విమర్శించారు. పద్నాలుగేళ్ల వయసులో హవాయిలోని బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచినప్పుడు ఆనందంతో ఎగిరి గంతులేసింది కత్రినా. ఆ జోష్‌లో ఫ్రీలాన్స్ ఏజెన్సీల తరఫున మోడల్‌గా పని చేయడం స్టార్ట్ చేసింది. లండన్ ఫ్యాషన్ వీక్‌లో రెగ్యులర్‌‌గా కనిపించేది. అలాంటి సమయంలోనే అనుకోకుండా ఓ ఫ్రెండ్‌తో కలిసి సరదాగా చూసిపోదామని ఇండియాకి వచ్చింది. కానీ ఆ సరదా ట్రిప్పే ఆమె జీవితాన్నే మార్చేసింది. 

"ప్రిన్సెస్" కత్రినా

అనుకోకుండా కైజాద్‌ గుస్తాద్ తీసిన తీసిన ‘బూమ్’ మూవీలో నటించే చాన్స్ వచ్చింది కత్రినాకి. అమితాబ్ బచ్చన్, జాకీ ష్రాఫ్, గుల్షన్ గ్రోవర్, మధు సప్రే, పద్మాలక్ష్మి లాంటి ఫేమస్ పర్సనాలిటీస్ నటించిన ఆ మూవీలో కత్రినా ఒక గ్లామరస్ క్యారెక్టర్ చేసింది. అది ఆమెకి అంత పేరేమీ తెచ్చిపెట్టలేదు. కానీ టాలీవుడ్ ఎంట్రీకి మార్గం వేసింది. ‘మల్లీశ్వరి’ మూవీలో వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాలో కత్రినాని ఓ ప్రిన్సెస్‌లా చూపించాడు దర్శకుడు విజయభాస్కర్. సినిమా కూడా పెద్ద హిట్ కావడంతో బాలీవుడ్‌ ఆమెని అవకాశాలతో ముంచెత్తింది. సర్కార్, మైనే ప్యార్ క్యూం కియా చిత్రాలు చేశాక వెంటనే తెలుగులో బాలయ్యతో ‘అల్లరి పిడుగు’లో నటించే అవకాశం. అంతే.. ఆ తర్వాత ఇక తెలుగు సినిమాలో నటించే తీరిక లేనంత బిజీ అయిపోయింది కత్రినా.

అవమానాల్ని దాటి..

వరుసపెట్టి అవకాశాలు ఎలా వచ్చాయో అవమానాలూ అలానే వచ్చాయి కత్రినాకి. ఆమెపై చాలామంది నెగిటివ్ రివ్యూలు రాసేవారు. సోషల్ మీడియాలో మనసును గాయపర్చే కామెంట్స్ పెట్టేవారు. పిండిబొమ్మలా ఉందని, ఆ ముఖంలో హావభావాలే పలకవని, చిన్న చిన్న స్టెప్స్ కూడా వేయడం రాదని.. ఇలా ఎన్నో అన్నారు. అవి కత్రినాని బాధపెట్టాయేమో కానీ కంగారుపెట్టలేదు. నటనపై దృష్టి పెట్టింది. పట్టు వదలకుండా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఇక తాను రెడీ అనుకున్నాక సత్తా చూపించడానికి ‘అగ్నిపథ్’ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పింది. ఆమె ఐటమ్ సాంగ్ చేయడమేంటో అంటూ అప్పుడు కూడా పెదవి విరిచారంతా. కానీ ‘చిక్‌నీ చమేలీ చుప్‌కే అకేలీ’ అంటూ కత్రినా చేసిన స్టెప్స్ చూశాక అందరి మతులూ పోయాయి. అప్పుడు డ్యాన్స్ రాదని తాము అన్నది ఈమెనేనా అని ఆశ్చర్యపోయే రేంజ్‌లో అదరగొట్టింది కత్రినా. తర్వాత ‘బాంబే టాకీస్‌’లో ‘షీలాకీ జవానీ’ పాటతో మరోసారి దుమ్ము రేపింది. ఇక కత్రినాకి తిరుగులేదు అని అందరూ అనేలా చేసింది.

విమర్శలకు దీటుగా బదులు

అప్పటి నుంచి ఇప్పటి వరకు కత్రినా మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోతోంది. ఏక్‌థా టైగర్, జబ్‌ తక్‌ హై జాన్, ధూమ్‌ 3, బ్యాంగ్ బ్యాంగ్, ఫ్యాంటమ్, ఫితూర్, టైగర్ జిందా హై, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, జీరో, భారత్ అంటూ వరుస సినిమాలు చేసింది. వీటిలో కొన్ని సినిమాలు అట్టర్‌‌ ఫ్లాప్ అయినప్పుడు కూడా ఐరన్ లెగ్ అంటూ కామెంట్స్ వచ్చాయి. కానీ అవి కత్రినా స్పీడుకి మాత్రం బ్రేకులు వేయలేకపోయాయి. రీసెంట్‌గా ‘సూర్యవంశీ’లో అక్షయ్ కుమార్‌‌తో జోడీ కట్టి బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. హిట్లూ, ఫ్లాపులూ తన ఇమేజ్‌ని దెబ్బ తీయవని, డిమాండ్‌ని ఏమాత్రం తగ్గించలేవని మరోసారి ప్రూవ్ చేసింది. ప్రస్తుతం ఫోన్ భూత్, మెర్రీ క్రిస్మస్, టైగర్ 3 సినిమాలు చేస్తోంది. అతి త్వరలో ఓ సూపర్ హీరో ఫిల్మ్ కూడా చేయబోతోంది. 

నెగిటివ్ కామెంట్స్ కి భయపడి వెనకడుగు వేస్తే ఎప్పటికీ ముందుకు పోలేమని, పట్టుదలతో ప్రయత్నిస్తే సక్సెస్‌ సాధించకుండా ఎవరూ ఆపలేరని నిరూపించిన కత్రినా.. ఇకపై కూడా ఇలాగే ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఆమెకి (జులై16) పుట్టినరోజు శుభాకాంక్షలు.