తెలుగు రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. సమ్మర్ స్పెషల్ ట్రైన్స్

తెలుగు రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. సమ్మర్ స్పెషల్ ట్రైన్స్

వేసవి సెలవులు మొదలయ్యాయి. పిల్లలతో కలిసి కుటుంబమంతా స్వగ్రామాలకు పయనమవుతారు. ఈ నేపథ్యంలో బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంటాయి. వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల వెతలు తీర్చేలా..దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విశాఖ నుంచి విజయవాడ మీదుగా మహబూబ్ నగర్, తిరుపతి, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. నేటి నుంచి ( మే 2)  జూన్ 28 వరకు విశాఖ-మహబూబ్‌నగర్ మధ్య, జూన్ 27 వరకు విశాఖ-తిరుపతి, ఈ నెల 7 నుంచి 29 వరకు  విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్ల రాకపోకలు జరగనున్నాయి. 

ప్రత్యేక  రైళ్ల వివరాలు 

విశాఖపట్నం-మహబూబ్‌నగర్ మధ్య నేటి ( మే2) నుంచి ప్రత్యేక రైలు (08585/08586) జూన్ 28 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. విశాఖలో సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఈ స్పెషల్ ట్రైన్ దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజిగిరి, కాచిగూడ, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. 

విశాఖపట్నం-తిరుపతి

నేటి(మే2) నుంచి జూన్ 27 వరకు విశాఖపట్నం-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు (08583/08584) అందుబాటులో ఉంటుంది. విశాఖలో రాత్రి 7.10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి రాత్రి 9.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అనకాపల్లి, అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, తెనాలి, ఒంగోలు మీదుగా తిరుపతి వెళ్తుంది. 

విశాఖపట్నం- బెంగళూరు

మే 7వ తేదీ నుండి ఏప్రిల్ 29 వరకు విశాఖపట్నం- బెంగళూరు (08543/08544) స్పెషల్ ట్రైన్ నడుస్తుంది. విశాఖలో మధ్యాహ్నం 3.55 గంటలకు బయల్దేరి రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, కాట్పాడి, జోలార్‌పేట, కుప్పం మీదుగా మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరిగి బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మర్నాడు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ వివరాలను గమనించి.. ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.