లాక్ డౌన్ తో దేశంలో ప్రజలంతా ఇంటికే పరిమితమవగా , అందరికీ టీవీ చూసేందుకు ఎక్కువ సమయం దొరికింది. దీంతో సినిమాలు, సీరియల్స్, భక్తిపరమైన సీరియల్స్ మిస్ కాకుండా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రామాయణం, మహా భారతం దూరదర్శన్ లో తిరిగి ప్రారంభించగా.. ఇప్పుడు శ్రీకృష్ణ సీరియల్ కూడా రానుంది. ఈ విషయాన్ని ప్రసారభారతి ట్విట్టర్లో తెలిపింది. 90లలో ప్రసారమైన పురాణ గాథ శ్రీకృష్ణని తిరిగి ప్రసారం చేయనున్నట్టు ట్వీట్ చేసింది.
రామానంద్ సాగర్ యొక్క శ్రీ కృష్ణ మొదట 1993-1996 మధ్య ప్రసారం చేయబడింది. అప్పట్లో అత్యధిక రేటింగ్ పొందిన ఈ సీరియల్ మొట్టమొదట 1993లో దూరదర్శన్(డీడీ2లో) ప్రసారమయింది. ఆపై 1996 లో డీడీ నేషనల్ మళ్లీ మొదటి నుంచి ప్రసారం చేసింది. ప్రేక్షకుల కోరిక మేరకు 2020లో మళ్లీ శ్రీకృష్ణ సీరియల్ ని త్వరలోనే తిరిగి ప్రసారం చేయనున్నట్లు తెలిపింది.
రామాయణం, మహా భారతం సీరియల్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని.. ఆయా సమయాల్లో ఎన్నడూ లేనంతగా దూరదర్శన్ చూస్తున్నారని చెప్పింది. శ్రీకృష్ణ ఏ సమయంలో ప్రసారం చేయాలన్నది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఇప్పటికే అనేక ఛానెల్స్ లో ప్రసారమైన ఈ పాపులర్ సీరియల్.. తిరిగి ప్రసారం కాబోతుండడంతో అభిమానులు ఆనందిస్తున్నారు.

Coming Soon! #ShriKrishna on @DDNational.#StayHome pic.twitter.com/1SD1RveGwi
— Prasar Bharati (@prasarbharati) April 23, 2020
