ఇయ్యాల్టి నుంచి యాదగిరీశుడి జయంతి ఉత్సవాలు

ఇయ్యాల్టి నుంచి యాదగిరీశుడి జయంతి ఉత్సవాలు
  • యాదగిరిగుట్టలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న అర్చకులు
  • ఆయా రోజుల్లో  ఆర్జిత సేవలు బంద్

యాదగిరిగుట్ట, వెలుగు : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు శుక్రవారం షురూ అయి మూడు రోజుల పాటు కొనసాగుతాయి. తొలి రోజు ఉదయం 8:45 గంటలకు కొత్త గుట్ట, పాత గుట్ట ఆలయాల్లో స్వస్తివాచనం, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కుంకుమార్చన, మత్స్యగ్రహణం, అంకురార్పణ, హవనంతో జయంతి ఉత్సవాలను  అర్చకులు ప్రారంభిస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామికి పలు రకాల అలంకార సేవలు అందిస్తారు. గుట్ట అనుబంధ ఆలయమైన దబ్బగుంటపల్లిలోని యోగానంద నరసింహస్వామి టెంపుల్ లో కూడా ఏకకాలంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. 

ఇందులో భాగంగా తొలిరోజు తిరువేంకటపతి అలంకార సేవ, సాయంత్రం గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ .. 10న ఉదయం కాళీయమర్దన అలంకార సేవ, సాయంత్రం హనుమంత వాహనంపై శ్రీరామావతార అలంకార సేవ చేపడతారు. చివరి రోజైన పూర్ణాహుతి, నరసింహుడి జయంతి, నృసింహ అవతార ఆవిర్భావ ఘట్టంతో జయంతి ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారి ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు.

వైభవంగా లక్ష పుష్పార్చన..

ఏకాదశి పర్వదినం సందర్భంగా గుట్టలో స్వామివారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మంటపంలో స్వర్ణపీఠంపై లక్ష్మీసమేత నారసింహుడిని అధిష్టింపజేసి లక్షపుష్పార్చన చేపట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణాల నడుమ స్వామిఅమ్మవార్లను అర్చించారు.