సిద్దిపేట, వెలుగు : పరిశ్రమల ఏర్పాటుకు రాజకీయాలకతీతంగా అందరూ సహకరించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట లో 210 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బయోగ్యాస్ పరిశ్రమ భూమి పూజకు హాజరై మాట్లాడారు. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని గత ప్రభుత్వంలో చేపట్టిన మంచి పనులను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలనే ఉద్దేశంతో భూములు సేకరించామని, కాళేశ్వరం ప్రాజెక్టు రావడం వల్లనే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని అన్నారు. మొన్న పామాయిల్ ఫ్యాక్టరీ వచ్చినా, ఈరోజు బయోగ్యాస్ ప్లాంట్ వచ్చినా రెండింటికి లింక్ కాళేశ్వరం ప్రాజెక్టేనని ఇక్కడ ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల రైతులకు వరి తోపాటు గడ్డి కి కూడా డబ్బులు వస్తాయన్నారు.
కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు ఎం.హన్మంతరావు, రాజ్యసభ సభ్యులు భువనేశ్వర్ కలిత, ఎన్. కె. ప్రేమచంద్రన్, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పాల్గొన్నారు.
