హిందువుల ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీరామనవమి పండుగను ప్రతి పల్లె, పట్నంలో ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే ఈ 2026 సంవత్సరంలో శ్రీరామనవమిని భద్రాచలంలో ఎప్పుడు జరుపుతారు? అసలు ఈ తేదీ గందరగోళానికి కారణమేంటి? పండితులు ఏమి చెప్పారు ? ఈ ఏడాది రాములోరి కళ్యాణం ఎప్పుడు జరుపుకోవాలి.. మొదలైన పూర్తి సమాచారం వివరంగా తెలుసుకుందాం.
హిందూ మతంలో పవిత్రమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీ రాముడు చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజు జన్మించాడు. అందువలన ప్రతి సంవత్సరం శుక్లపక్షంలోని తొమ్మిదవ రోజున శ్రీరామ నవమి పండుగను పల్లెల్లో, పట్టణంలో ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
రాముడు భారతావని గుండె చప్పుడు. శ్రీరాముని ప్రతి మనిషికీ ఆదర్శప్రాయుడు. రాముడు దేవుడు అంటే అది ఆయన ఖ్యాతిని పరిమితం చేసేదిగా అయిపోతుంది. ఎందుకంటే, ఆయన అంతకు మించి. దేవుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం అయితే.. రాముని అడుగుజాడలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం అనేది నిజం. అలాంటి రాములోరి జన్మదినం.. కల్యాణం ఒకేరోజు వస్తాయి. ఆ పవిత్రమైన రోజునే శ్రీరామనవమి గా ఊరూ వాడా వేడుకగా జరుపుకుంటాయి. రాములోరి కల్యాణం చూడాలని ప్రతి ఏటా భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తారు.
ఈ సంవత్సరం శ్రీ రామనవమిని ఎప్పుడు జరుపుకోవాలి అనేదానిపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే, మనకి భద్రాచలంలో కళ్యాణం జరిగే రోజే శ్రీరామనవమి ఉత్సవం జరుపుకునే రోజు అవుతుంది.
►ALSO READ | జ్యోతిష్యం : మిథున రాశిలోకి గురుడు, చంద్రుడు : ఈ మూడు రాశులకు ఊహించని మంచి ఫలితాలు..!
శ్రీరామనవమి తిథి... శ్రీరాముడు దుష్ట శక్తులను నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడానికి విష్ణుమూర్తి తీసుకున్న ఏడవ అవతారం. హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసంలో వచ్చే నవమి తిథి నాడు రామ నవమిని జరుపుకుంటారు.
2026లో, నవమి తిథి మార్చి 26 మధ్యాహ్నం ప్రారంభమై మార్చి 27 మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. దీంతో పండగ 26నా.. 27నా అనే డౌట్ ప్రతిఒక్కరిలోనూ ఉంది. దేశవ్యాప్తంగా క్యాలెండర్లలో 26వ తేదీని శ్రీరామనవమిగా చూపించారు. భద్రాచలంలో రాములోరి కళ్యాణం 27వ తేదీగా ప్రకటించారు. దీంతో భక్తుల్లో గందరగోళం ఏర్పడింది.
పండితులు ఏం చెప్పారంటే...
హిందువులు.. సాధారణంగా, సూర్యోదయ సమయంలో నవమి తిథి వచ్చే రోజును రామ నవమిగా జరుపుకుంటారు. దీని ప్రకారం, పంచాంగ సూచనల ప్రకారం 2026, మార్చి 27, శుక్రవారం నాడు రామ నవమిని జరుపుకోవాలి.
శ్రీరామనవమి పూజా సమయం:
శ్రీరామ నవమి నాడు శ్రీరాముడిని పూజించడానికి మధ్యాహ్నం ఉత్తమ సమయంగా పరిగణిస్తారు.శ్రీ రామ నవమి పూజ సమయం (మధ్య ముహూర్తం): మార్చి 27, 2026 ఉదయం 11.06 నుండి మధ్యాహ్నం 1.31 వరకు. ఈ రెండు గంటల సమయం శ్రీరాముడిని పూజించడానికి అత్యంత శక్తివంతమైన సమయంగా పరిగణిస్తారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా అదే సమయంలో జరుగుతుంది.
నవమి తిథి వివరాలు:
- నవమి తిథి ప్రారంభం : మార్చి 26న మధ్యాహ్నం 2.18 గంటలకు
- నవమి తిథి ముగింపు: మార్చి 27న మధ్యాహ్నం 12.36 గంటలకు
పురాణాల ప్రకారం, చైత్ర మాసంలోని నవమి తిథి నాడు రఘువంశానికి చెందిన దశరథ మహారాజు, కౌసల్య దేవిల కుమారుడిగా శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో అవతరించారు. ఆ రోజున దేశవ్యాప్తంగా ఉన్న రామ మందిరాలలో ప్రత్యేక పూజలు, భజనలు, రథయాత్రలు నిర్వహిస్తారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో అదేరోజు సీతారాముల కళ్యాణం జరిగిందని నమ్ముతారు. అందుకే అదే ముహూర్తానికి భద్రాచలంతో పాటు పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా భక్తులకు పానం అందించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. శ్రీరామనవమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది మనకు ధర్మ మార్గంలో నడవాలని నేర్పే ఒక పవిత్రమైన రోజు. అందుకే ఊరూ వాడా.. ప్రతి చోట శ్రీరాముని కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు సీతారాములను సేవిస్తారు
