తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రాకుండా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని స్టాలిన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో ఇకపై తమిళనాడు రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
గతంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఇదే తరహా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడు మంత్రి వి.సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే డీఎంకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగపరుస్తోందంటూ తీవ్రంగా ఆరోపిస్తూ.. ఇప్పటికే దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి జనరల్ కన్సెంట్ను ఉపసంహరించుకున్నాయి. ఆ జాబితాలో తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కేరళ, ఝార్ఖండ్, పంజాబ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలు ఉన్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం ఆ జాబితాలో చేరింది.