
పద్మారావునగర్, వెలుగు: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, ఆధార్ లింకేజీల కోసం రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. శనివారం ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తో కలసి పద్మారావునగర్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో ఏర్పాటు చేసిన బూత్ లెవల్ అధికారి (బీఎల్వో) శిబిరాన్ని సందర్శించారు. కొత్త ఓటర్ల నమోదు, తదితర ప్రక్రియలపై సిబ్బందిని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన ‘వెలుగు’తో మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన వారితో పాటు 17 ఏండ్లు పూర్తయిన వారి నుంచి కూడా ఓటు హక్కుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. వారికి 18 ఏండ్ల వయసు రాగానే ఆటోమెటిక్గా ఓటు హక్కు వస్తుందన్నారు. ఈ నెల 26, 27 తేదీలతో పాటు వచ్చే నెల 3, 4 వ తేదీల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి, కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేస్తామన్నారు. అర్హత కలిగిన కొత్త ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.