- 10 చోట్ల కాంగ్రెస్.. 2 చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపు
- రామగుండం, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో ఇద్దరు కార్పొరేటర్లు
- ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన.. 2,982 వార్డులకు జరగనున్న ఎన్నిక
- బరిలో 12,930 మంది అభ్యర్థులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 14 మున్సిపల్ వార్డులు ఏకగ్రీవమైనట్టు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్రాణి కుముదిని తెలిపారు. 10 చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు వార్డు సభ్యులుగా ఎంపికయినట్టుఅధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,982 వార్డులకు 12,930 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని.. వీరికి ఎన్నికల గుర్తులు కేటాయించామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వార్డులకు ఈ నెల 11న పోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. జాతీయ, రాష్ట్ర పార్టీల తరఫున ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు సైతం గుర్తులు అలాట్ చేసినట్టు చెప్పారు. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 2,936, బీఆర్ఎస్ నుంచి 2,876, బీజేపీ నుంచి 2,634 మంది, 2,786 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. జనసేన నుంచి 332 మంది పోటీ చేస్తున్నారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ నుంచి కొందరు నామినేషన్లు వేసినప్పటికీ ఆ పార్టీ తరఫున బీ ఫారాలు అందించకపోవడంతో ఆ అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ఆఫీసర్లు తిరస్కరించారు. ఆప్ నుంచి 38, బీఎస్పీ 213, సీపీఎం 128, ఎంఐఎం 282, ఏఐఎఫ్బీ 288, సీపీఐ 168, ఐయూఎంఎల్ నుంచి 9 మంది ఎన్నికల బరిలో నిలిచారు.
ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థులు వీరే..
రాష్ట్ర వ్యాప్తంగా 13 వార్డులు, రెండు డివిజన్లో గెలిచిన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో మడిపెల్లి విజయ, మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో58వ వార్డులో బి రమాదేవి.. మున్సిపాలిటీల వారీగా భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ 17వ వార్డులో చింతల ఉమామహేశ్వరి, యాదగిరి గుట్ట 10వ వార్డులో గుండ్లపల్లి వాణి, ఖమ్మం జిల్లా ఏదులాపురం 15వ వార్డులో తమ్మినేని మంగతాయి, నల్గొండ జిల్లా హాలియా 10వ వార్డులో చంద్రకళ పిల్లి, సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ 3వ వార్డులో సులువ నాగలక్ష్మీ, కోదాడ 11వ వార్డులో దేవరపల్లి మళ్లీశ్వరీ, 21వ వార్డులో కట్టెబోయిన జ్యోతి, 21వ వార్డులో యెర్నేని కుసుమ కుమారి, మెదక్ 32వ వార్డులో గొడల మానస, వికారాబాద్ 1వ వార్డులో అనంత్ రెడ్డి పటోళ్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ తరపున గద్వాల జిల్లా ఆలంపూర్ 10వ వార్డులో పి.విక్రమ్, వికారాబాద్ 15వ వార్డులో పి.విజయలక్ష్మీ గెలిచినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.
మూడు ప్రధాన పార్టీలు అన్నీ చోట్లా పోటీ చేయట్లే!
మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డులు ఏకగ్రీవం కాగా 2,982 వార్డులకు ఎన్నికలు జరగుతున్నాయి. అయితే, ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుల ప్రకారం మూడు ప్రధాన రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులు అందరూ అన్నీ చోట్ల పోటీ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ 46, బీఆర్ఎస్ 106, బీజేపీ 348 స్థానాలలో పోటీలో లేదు. లోకల్ పొత్తులలో భాగంగా ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నది. కొందరికి బీ ఫారాలు ఇచ్చినా కూడా గడువులోగా వీటిని సబ్ మిట్ చేయకపోవడంతో అవి రద్దయ్యాయి.
