ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ సంకేతాలు, పెరుగుతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో, దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు ( 29 జులై) బుధవారం బలమైన ర్యాలీని చూసింది. ట్రేడింగ్ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పెరగగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 కూడా 24,300కు చేరువైంది. సెన్సెక్స్ చివరకు 888.68 పాయింట్లు (1.16%) పెరిగి 77,654.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 264.85 పాయింట్లు (1.10%) పెరిగి 24,250.20కి చేరింది. రూపాయి కూడా డాలర్తో పోలిస్తే 0.2% బలపడి, నిన్న 95.8525 వద్ద ముగియగా, ఈరోజు 95.6475 వద్ద ముగిసింది.
ఈ పెరుగుదలతో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ 4 లక్షల కోట్లు పెరిగి 483 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ స్టాక్లలో 25 లాభాలతో ముగియగా, హిందుస్థాన్ యూనిలివర్ 4.59% పెరిగి అత్యధికంగా లాభపడింది. ట్రెంట్, టాటా స్టీల్, లార్సెన్ & టూబ్రో, భారతి ఎయిర్టెల్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, కోటక్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు కూడా చెప్పుకోదగ్గ లాభాలను చూశాయి. మరోవైపు, అదానీ పోర్ట్స్, మహీంద్రా & మహీంద్రా, పవర్గ్రిడ్, బీఈఎల్, ఎన్టీపీసీ నష్టాలతో ముగిశాయి.
నిఫ్టీ స్టాక్ పరిస్థితి
వైడ్ మార్కెట్లో, నిఫ్టీ మిడ్క్యాప్ & నిఫ్టీ స్మాల్క్యాప్ లు వరుసగా 0.82 శాతం ఇంకా 1.48 శాతం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ50లో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, హిందుస్థాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్ అత్యధిక లాభాలను నమోదు చేశాయి. రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచీలు మంచి పనితీరు కనబరచగా, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఆటో సూచీలు వెనుకబడ్డాయి.
ALSO READ : ఐఫోన్, మ్యాక్బుక్ కొనలేకపోతున్నారా ? ఆపిల్ నుంచి సూపర్ ఆఫర్..
ముడి చమురు పెరుగుదల
ఇదిలా ఉండగా, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్పై ప్రతీకార దాడులు ప్రారంభించినట్లు అమెరికా సైన్యం ప్రకటించడంతో, కొన్ని రోజుల ప్రశాంతతకు తెరపడి, ఇంధన సరఫరాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. ట్రేడింగ్ సమయంలో బ్రెంట్ క్రూడ్ 5% పెరిగి బ్యారెల్కు దాదాపు $88కి చేరుకుంది. అయితే, ఉదయం ప్రారంభ ట్రేడింగ్లో బ్యారెల్కు $84కి పడిపోయింది.
