న్యూఢిల్లీ: మార్కెట్ డైరెక్షన్ను ఈ వారం మాక్రో ఎకనామిక్ డేటా, గ్లోబల్ జియోపొలిటికల్ పరిణామాలు, అలాగే ఏఐ వల్ల కలిగే అంతరాయాలపై పెరుగుతున్న ఆందోళనలు ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. విదేశీ పెట్టుబడిదారుల ట్రేడింగ్, రూపాయి కదలికలపై ట్రేడర్లు దృష్టి పెట్టాలని అన్నారు. ఈ నెలలో ఇప్పటివరకు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.19,675 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
‘‘తాజాగా టారిఫ్ సంబంధిత ఆందోళనలు తగ్గడం, దేశీయ కంపెనీల క్వార్టర్లీ ఫలితాలు మిశ్రమంగా ముగియడం వల్ల, మార్కెట్ దృష్టి ప్రధానంగా అమెరికా జాబ్స్ డేటా, ఫెడ్ పాలసీ అంచనాలపై మారింది. అయితే ఏఐ అంతరాయాలు, జియోపొలిటికల్ రిస్క్లతో మార్కెట్ పడుతోంది. ఐటీ, మెటల్స్ రంగాలు ఒత్తిడిలో ఉండగా, బ్యాంకింగ్, ఆటోలు, కన్జూమర్ రంగాల్లో కొనుగోళ్లు రావొచ్చు”అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ తెలిపారు.
గత వారం సెన్సెక్స్ 953 పాయింట్లు, నిఫ్టీ 222 పాయింట్లు పడిపోగా, గ్లోబల్గా టెక్ షేర్లు పడడం ఇందుకు కారణమయ్యింది. ఈ వారం ఇండియా హోల్సేల్ ద్రవ్యోల్బణం, ట్రేడ్ డేటా, హెచ్ఎస్బీసీ పీఎంఐ, బ్యాంక్ లోన్ గ్రోత్, ఫారెక్స్ రిజర్వ్స్ వంటివి విడుదల కానున్నాయి. ఫెడ్ మినిట్స్ వెలువడనుండడంతో ఫెడ్ వైఖరిపై ఒక క్లారిటీ రావొచ్చు.
