అకాల వర్షాలతో అన్నదాతలకు తీవ్ర నష్టం

అకాల వర్షాలతో అన్నదాతలకు తీవ్ర నష్టం

వెలుగు నెట్ వ‌ర్క్ : అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్ లో ఆదివారం కురిసిన వర్షాలతో కోతకొచ్చిన పంట నేలపాలైంది. అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. సిద్దిపేట జిల్లాలో మూడు చోట్ల పిడుగులు పడటంతో ఒక వ్యక్తితో పాటు మూడు పాడి పశువులు మృతిచెందాయి. కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని టార్పాలిన్ కవర్లు లేకపోవడంతో వేలాది క్వింటాళ్ల ధాన్యం వర్షానికి తడిసి పోయింది. బెజ్ జంకి , కోహెడ, అక్కన్నపేట , హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం తడిసి పోయింది.

నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. చేర్యాల మండలం ఆకునూరు కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేశారు. హుస్నాబాద్ మండలం పందిళ్ల వద్ద కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్నిఆర్వోడీ జయచంద్రారెడ్డి పరిశీలించారు. చిలప్​చెడ్, కొల్చారం, మెదక్, రామాయంపేట, నిజాంపేట్ మండలాల్లో259 ఎకరాల్లోవరి, కూరగాయలు, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది.

రాజన్నసిరిసిల్లజిల్లాలోని ఏడు మండలాల పరిధిలో అకాల వర్షాలకు 2,791 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. చిగురుమామిడి మండలం గునుకుపల్లెలో తడిసిన ధాన్యాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ పరిశీలించగా.. సిరిసిల్లజిల్లా కోనరావుపేట మండలంలో నష్టపోయిన వరి పంటను ఆ జిల్లాబీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పరిశీలించారు. చొప్పదండి మండలం కొలిమికుంట, రామడుగు మండలం గోపాల్ రావుపేటలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మానకొండూర్ లో తడిసిన ధాన్యాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు.

రాజన్న సిరిసిల్లజిల్లా కలెక్ట‌ర్ ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలోని వాగులో ఒక కి.మీ. దూరం కాలినడకన వెళ్లి అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న వరిపైరును పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం 21.9 మి.మీ. వర్ష‌ప‌తం నమోదైంది. డిచ్‍పల్లి, సిరికొండ, ధర్‍పల్లి, నిజామాబాద్ రూరల్, భీమ్‍గల్ మండలాల్లోరైతులు బయట రోడ్లపైనా, కల్లాలపైన ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల్లోపోసిన కుప్పలు తడిసిపోయాయి.

నేడూ వర్షాలు పడే చాన్స్

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వానలు పడ్డాయి . సోమవారంకూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే చాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రం భీం -ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్-(అర్బన్‌, రూరల్‌), మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తగ్గిన ఉష్ణో గ్రతలు

వానలతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. హన్మకొండలో సాధారణం కంటే 4.9 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత రికారయ్యింది. ఇటీవల ప్రతి రోజు 42 నుంచి 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డుకాగా, ఆదివారం అత్యధికంగా ఆదిలాబాద్‌లోని థాంసిలో 40.2 డిగ్రీలే నమోదైంది. రాష్ట్రంలోని రెం డు ప్రదేశాల్లో మినహా అంతటా 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి .